ఓ భారత మహిళ అబుదాబిలో జాక్పాట్ కొట్టింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 62 కోట్ల లాటరీని గెలుచుకుంది. ఢిల్లీకి చెందిన కనికా అరోరా అనే గృహిణి కొన్న లాటరీ టికెట్కు రూ. 62 కోట్ల ప్రైజ్మనీ వరించింది. అబుదాబి బిగ్ టికెట్ సిరీస్లో భాగంగా ప్రతీనెల లాటరీ టికెట్ కొనే ఆ మహిళకు జూన్ 30వ తేదీన తీసిన లాటరీలో 25 మిలియన్ దిర్హమ్ల భారీ మొత్తం వరించింది. తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకోవడంతో సదరు మహిళ ఉబ్బితబ్బిబ్బై పోతోంది.
సంవత్సరాలుగా ఢిల్లీకి చెందిన ఆమె కుటుంబానికి బిగ్ టికెట్ ఎంట్రీ కొనడం నెలవారీ అలవాటుగా మారింది. గృహిణి అయిన కనికా అరోరా అబుదాబి బిగ్ టికెట్ సిరీస్ 288 డ్రాలో 25 మిలియన్ దిర్హమ్ల (AED) గ్రాండ్ ప్రైజ్ (సుమారు రూ. 62 కోట్లు) గెలుచుకుని, చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకున్నారు.
దీనిపై ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ.. ‘ కొన్నేళ్లుగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నాం. సోషల్ మీడియా ద్వారా ఆ టికెట్ను కొనుగోలు చేశాం. అబుదాబిలో లాటరీ టికెట్ల కొనుగోలులో ఒక రకమైన ప్రమాదం ఉన్నప్పటికీ, వాటిని మాత్రం ప్రతీనెలా కొంటూనే ఉన్నాం. ఇన్నాళ్లకు మా కల సాకారమైంది. లాటరీలో బహుమతి గెలిస్తే ఆ మొత్తాన్ని ఏం చేయాలో అనే దానిపై నా భర్త, నేను మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ఇప్పుడు నిజంగా గెలవడంతో ఎక్కడ నుంచి ప్రారంభించాలో కూడా తెలియడం లేదు. ప్రతీ ఒక్కరూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. మన కల ఎలా నిజమౌతుందో చెప్పలేం కదా’ అంటూ ఆనందం వ్యక్తం చేసిదామె.


