కెనడాలో గుజరాత్కు చెందిన 22 ఏళ్ల విద్యార్థిని దారుణ హత్యు గురైంది. మృతురాలిని గుజరాత్లోని ఆనంద్ జిల్లా, బోర్సాద్కు చెందిన విధి కల్పేష్భాయ్ మేఘానిగా గుర్తించారు. దుండుగులు విధి మేఘను దారుణంగా పొడిచి చంపారు. ఆమె మృతదేహం అమెరికా–కెనడా సరిహద్దులో లభ్యమైంది.
అంతర్జాతీయ మీడియా ప్రకారం మేఘ గత నాలుగేళ్లుగా కెనడాలో నివసిస్తూ, తన చదువుతో పాటు, పార్ట్టైమ్ ఉద్యోగాన్ని కూడా చేసుకుంటూ ఉండేది. అంతేకాదు కెనడాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా సిద్ధమైంది. ఈ క్రమంలో ఈ నెల 15నుంచి ఆమె కనిపించకుండా పోయింది. దీనిపై కుటుంబ సభ్యులు, ఆమె సన్నిహితులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల గాలింపులో కెనడాలోని నయాగారా ప్రాంతంలో, కెనడా–అమెరికా సరిహద్దులో ఆమె మృతదేహం లభ్యమైంది. ఒంటిపై కత్తిపోట్లు ఆధారంగా ఆమెను ఎవరో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ దాడికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా అస్పష్టంగానే ఉంది. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: సీబీఎస్ఈ వివాదం : ఎట్టకేలకు మౌనం వీడిన ధరేంద్ర ప్రధాన్
ఇదీ చదవండి: భారత మామిడి పళ్లపై జపాన్ బ్యాన్ : ఎందుకో తెలుసా?


