సాక్షి, న్యూఢిల్లీ: సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానంపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు స్పందించారు. ఓఎస్ఎం వ్యత్యాసాలకు, విద్యార్థుల అసౌకర్యానికి తాను బాధ్యతవహిస్తున్నట్లు ప్రకటించారు. మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలను గుర్తిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
ఢిల్లీలో సీబీఎస్ఈ అధికారులతో సమావేశం అనంతరం మాట్లాడిన ప్రధాన్, బోర్డు కొత్త డిజిటల్ మూల్యాంకన నమూనాను సమర్థించడంతో పాటు, విద్యార్థులు ఎదుర్కొన్న ఒత్తిడిని కూడా అంగీకరించారు.స్కాన్ చేసిన కాపీలు అస్పష్టంగా ఉండటం, జవాబులను సరిచూసుకోలేదని ఆరోపణలు, పోర్టల్ క్రాష్లు, చెల్లింపు సమస్యలు, పునఃమూల్యాంకన ప్రక్రియలో గందరగోళం వంటి అంశాలపై అటు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారానికి తాను బాధ్యత తీసుకుంటున్నానని, అవకతవకలు కనుగొనబడితే "ఎవరినీ వదిలిపెట్టబోమని" విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆయన హామీ ఇచ్చారు. అంతేకాదు దీన్ని సరిచేసేలా పరిష్కారం కనుగొంటామనీ తామందరూ ఆ పనిపైనే పనిచేస్తున్నామని హామీ ఇచ్చారు. పరీక్ష రాసిన 17 లక్షల మంది విద్యార్థుల 98 లక్షల కాపీల జవాబు పత్రాలను భద్రపరిచామని వెల్లడించారు.
ఇదీ చదవండి: భారత మామిడి పళ్లపై జపాన్ బ్యాన్ : ఎందుకో తెలుసా?
కాగా సీబీఎస్ఈ మార్క్ల షీట్లు తారుమారు కావడం విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. దీనిపై విద్యార్థులు ఆన్లైన్ వేదికగా తమ అనుభవాలను స్ర్కీన్ షాట్లతో సహా పంచుకోవడంతోఇది మరింత ముదిరింది. దీంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ ఊపందుకుంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ కూడా ప్రదాన్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది.


