ముగిసిన ఆటా మహాసభలు
సాక్షి, అమరావతి: అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో నిర్వహించిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) జాతీయ మహాసభలు విజయవంతంగా ముగిశాయి. మహాసభల్లో భాగంగా ఆదివారం వైఎస్సార్ జయంతి కార్యక్రమం, ఎన్ఆర్ఐలతో విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రైమ్ హెల్త్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధిలో మరింత చురుకైన పాత్ర పోషించాలని ఎన్ఆర్ఐలను కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం వైఎస్ జగన్కు మరోసారి అవకాశం కల్పించే దిశగా ప్రతి ఎన్ఆర్ఐ తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు. మహాసభల సందర్భంగా అమెరికా నలుమూలల నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులతో జరిగిన సమావేశాలు, పరస్పర చర్చలు, సూచనలు భవిష్యత్తులో పార్టీ సంస్థాగత బలోపేతానికి, ఎన్ఆర్ఐల భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు దోహదపడతాయని ఆలూరు సాంబశివారెడ్డి తెలిపారు.


