ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసు వ్యాన్లో కర్నూలు సబ్జైలుకు తరలిస్తున్న దృశ్యం
రెడ్బుక్ రాజ్యంలో రెచ్చిపోయిన ఖాకీ గూండాలు
ఆలూరు ఎమ్మెల్యే ఇంటిపై మారణాయుధాలతో దాడి
గునపాలతో తలుపులు బద్దలు కొట్టిన పోలీసులు
ముందే అనుచరుల అరెస్టు.. సీసీ కెమెరాలు నిర్వీర్యం
భయానక వాతావరణం సృష్టించి బలవంతంగా స్టేషన్కు ఎమ్మెల్యే తరలింపు
హత్యాయత్నం కేసు నమోదు.. 14 రోజుల రిమాండ్
కార్యకర్త కుటుంబాన్ని కాపాడుకునేందుకు వెళ్లడమే విరూపాక్షి చేసిన నేరం
టీడీపీ మూకలను శాంతింపజేసి వస్తుంటే మరో గుంపు దాడి
ఆ ఘటనలో ఎమ్మెల్యే సోదరునికి గాయాలు..
ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తే నో కేస్.. పట్టించుకోని పోలీసులు
ఆ తర్వాత పైనుంచి వచ్చిన ఆదేశాలతో చెలరేగిన ఖాకీలు
అర్ధరాత్రి దాటిన తర్వాత ఎమ్మెల్యే ఇంటిపై దుర్మార్గంగా దాడి..
వైఎస్సార్సీపీ ఆందోళన.. గుంతకల్లు–ఆలూరు ప్రధాన రహదారిపై రాస్తారోకో
ఆదోని: ఆదివారం అర్ధరాత్రి.. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి స్వగ్రామం, మండల కేంద్రమైన చిప్పగిరిలో తన భార్య, బిడ్డలతో మంచి నిద్రలో ఉన్నారు. ఐతే ఇంటి ప్రధాన ద్వారం తలుపులు బద్దలు కొడుతున్న శబ్దంతో ఉలిక్కిపడి లేచారు భార్యాభర్తలు. ఇంట్లో నుంచి తొంగి చూస్తే దాదాపు 40 మందికి పైగా పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ పక్కకు తిప్పేశారు. గునపాలు, కొడవళ్లతో తలుపులను పగలగొడుతూ తెరిచే ప్రయత్నం చేశారు. విధిలేక ఆ భయానక వాతావరణంలోనే ఎమ్మెల్యే విరూపాక్షి భార్య రామాంజనమ్మ తలుపులు తెరిచారు.
ఒక్కసారిగా పోలీసులందరూ ఇంట్లోకి దౌర్యన్యంగా చొరబడ్డారు. నీ భర్త ఎక్కడ అంటూ ఆమె మీద చేతులు వేస్తూ పక్కకు నెట్టారు. ఎమ్మెల్యే ఉన్న బెడ్ రూం ద్వారాన్ని కూడా గునపంతో బద్దలు కొడుతూ తెరిచే ప్రయత్నం చేస్తుంటే ఆయన తలుపు తెరిచి బయటకు వచ్చారు. ఆరేడుగురు సీఐలు, దాదాపు నలభై మంది పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షిని చుట్టుముట్టి చిప్పగిరి పోలీసు స్టేషన్కు బలవంతంగా తరలించారు. రెడ్బుక్ రాజ్యాంగంలో తమ ఇంట్లో పోలీసులు జరిపిన దమనకాండ గురించి ఆలూరు ఎంఎల్ఏ విరూపాక్షి భార్య రామాంజనమ్మ నిలువెల్లా వణికిపోతూ చెప్పిన వివరాలివి. ఘటన పూర్వాపరాలను ఓమారు పరికిస్తే..
టీడీపీ మూకల దాడి నుంచి కార్యకర్తను కాపాడుకునేందుకు..
చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన గిరి అనే వ్యక్తి శనివారం రాత్రి ఎమ్మెల్యేకు ఫోన్ చేసి తనపై నేమకల్లు గ్రామానికి చెందిన టీడీపీ మూకలు దాడులు చేస్తున్నాయని, తనను కాపాడాల్సిందిగా వేడుకున్నాడు. వెంటనే ఎమ్మెల్యే సీఐకి ఫోన్ చేశారు. అయితే పోలీసులు అక్కడికి వెళ్లడానికి తాత్సారం చేస్తున్న విషయాన్ని గ్రహించి వెంటనే తన కార్యకర్త కోసం తన సోదరుడు శ్రీరాములు, కొందరు కార్యకర్తలను తీసుకుని రాత్రికి రాత్రే నేమకల్లు గ్రామానికి వెళ్లారు. అటు టీడీపీ, ఇటు వైఎస్సార్సీపీకి చెందిన ఇరుపక్షాలకు నచ్చచెప్పి ఇంటికి తిరుగు ముఖం పట్టారు.
అయితే ముందస్తు పథకంలో భాగంగా గ్రామంలోని ఓ సామాజిక వర్గానికి చెందిన కొందరు గూండాలు ఎమ్మెల్యేను చుట్టుముట్టి మా గ్రామానికి ఎందుకు వచ్చావంటూ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ దౌర్జన్యంగా దాడికి దిగారు. వారి దాడిలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములుకు చేయి విరిగింది. వెంటనే తన సోదరుడిని వెంట తీసుకుని చిప్పగిరి పోలీసు స్టేషన్కు వెళ్లారు. ఫిర్యాదు ఇస్తే పోలీసులు నిరాకరించారు. దీంతో పోలీసులు టీడీపీ వర్గీయులకు వత్తాసు పలుకుతున్నారంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేషన్ ఎదుట కొద్దిసేపు బైఠాయించారు. అర్ధరాత్రి తన ఇంటికి తిరిగివెళ్లారు.
పక్కా పథకం ప్రకారమే ఎమ్మెల్యే నివాసంపై దాడి
ముందు రచించుకున్న పథకం మేరకు ఇక పోలీసులు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు పరిచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత చుట్టు పక్కల ప్రాంతాలైన ఆదోని, పత్తికొండ, గుంతకల్లు, ఆస్పరి స్టేషన్లకు చెందిన సీఐలను, పోలీసులను పిలిపించుకున్నారు. పక్కా పథకం మేరకు 2.45 గంటల సమయంలో నక్సల్స్ను పోలీసులు చుట్టిముట్టినట్లు సీఐలు, భారీ ఎత్తున పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షిని ఇంటిని చుట్టుముట్టారు. ఇంటి బయట ఉన్న ఎమ్మెల్యే అనుచరులను ముందే స్టేషన్కు తరలించారు.
ఇక ఇంట్లో కేవలం ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి, మరో మహిళా బంధువు మాత్రమే మిగిలారు. తర్వాత పోలీసులు గుండాల్లా రెచ్చిపోయారు. ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ నిర్వీర్యం చేశారు. గునపాలతో తలుపులను పగలగొడుతూ తెరిచే ప్రయత్నం చేశారు. చివరకు ఎమ్మెల్యే భార్య తలుపులు తెరిచారు. ఇంట్లో ఉన్న వస్తువులను చిందరవందర చేసి ఎమ్మెల్యే ఉన్న బెడ్ రూంను కూడా ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తుంటే ఆయన బయటకు వచ్చారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని చిప్పగిరి పోలీసుస్టేషన్కు తరలించారు.

చిప్పగిరిలో ఆదివారం ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటి గడియ ధ్వంసం చేసిన పోలీసులు
స్టేషన్ వద్ద కార్యకర్తల ఆందోళన..
ఎమ్మెల్యే నివాసంపై దాడిచేసి అత్యంత దుర్మార్గంగా నిర్బంధించిన విషయం తెల్లవారుజామునే సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్రమంతా వ్యాపించింది. దీంతో కర్నూలు, నంద్యాల, అనంతపురం, తదితర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వందలాది మంది కార్యకర్తలు, నాయకులు , మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు చిప్పగిరి పోలీసు స్టేషన్కు తరలివచ్చారు. భారీగా చేరుకున్న కార్యకర్తలు పోలీసు స్టేషన్ను ముట్టడించే ప్రయత్నం చేస్తుండటంతో స్టేషన్ గేట్లను మూసివేశారు. భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఆగ్రహించిన నాయకులు, కార్యకర్తలు గుంతకల్లు–ఆలూరు ప్రధాన రోడ్డు మీద బైఠాయించారు. రాస్తారోకో నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ఎమ్మెల్యే విరూపాక్షిని వెంటనే విడిచిపెట్టాలని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు.
కార్యకర్తకు అండగా నిలవడం తప్పా?
టీడీపీ మూకలు దౌర్జన్యం చేస్తున్నాయని పార్టీ కార్యకర్త గిరి బాధపడుతుంటే కాపాడుకోవాలని ఎమ్మెల్యే వెళ్లడం, కార్యకర్తకు అండగా ఉండడం తప్పెలా అవుతుందని ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే నివాసం వద్ద జరిగిన విలేకరులకు సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ పెద్దల సూచనల మేరకు పోలీసులు పన్నిన పన్నాగమిది అని వ్యాఖ్యానించారు. కేసులకు బెదరబోమన్నారు. అంతకుముందు సాయిప్రసాద్ రెడ్డి సీనియర్ న్యాయవాది జీవన్సింగ్తో పాటు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ మంత్రి శైలజనాథ్, ఎంఎల్సీ డా.మధుసూదన్లను స్టేషన్లోకి తీసుకువెళ్లి డీఎస్పీ వెంకటరామయ్య, తదితర పోలీసు అధికారులతో మాట్లాడారు.
హత్యాయత్నం కేసు.. 14 రోజులు రిమాండ్
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై చిప్పగిరి పోలీసులు హత్యాయత్నం కేసు (ఎఫ్ఐఆర్ నంబరు: 37/2026) నమోదు చేశారు. ఈ కేసులో ఆయనతో పాటు మరో 16 మందికి ఆలూరు జేఎఫ్సీఎం కోర్టు 14 రోజుల జ్యుడీషీయల్ రిమాండ్ విధించింది. వీరిని కర్నూలు జైలుకు తరలించారు. కాగా ఎమ్మెల్యే మీద హత్యాయత్నం కేసులో మాత్రమే కోర్టు రిమాండ్ విధించింది. అయితే ఎమ్మెల్యే తరఫు న్యాయవాది జీవన్సింగ్ ఆదివారం రాత్రి కీలక పిటిషన్ దాఖలు చేశారు. అట్రాసిటీ కేసులో కూడా రిమాండ్ అంశంపై విచారణ చేపట్టాలని కోర్టును కోరారు.
ఈ పిటిషన్పై సోమవారం కోర్టు విచారణ జరపనుంది. ఇదే సమయంలో ఘటనకు సంబంధించి కీలక ఆధారాలను భద్రపరచాలని కోరుతూ మరో పిటిషన్ కూడా దాఖలైంది. ఘటన అనంతరం ఎమ్మెల్యేను తీసుకువచ్చిన చిప్పగిరి పోలీసు స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ను కోర్టు ముందుంచాలని న్యాయవాది జీవన్సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సంబంధిత పోలీసు స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరచి రెండు రోజుల్లోగా కోర్టు ముందుంచాలని పోలీసు అధికారులను ఆదేశించింది. కేసు విచారణలో ఆ ఫుటేజీ కీలక ఆధారంగా మారే అవకాశం ఉందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
మంత్రాలయం రూరల్: ఆలూరు ఎమ్మెల్యే బూసినె విరూపాక్షిపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. ఈ ఘటనను సామాజిక మాధ్యమాల ద్వారా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలువుతోందన్నారు. ఆలూరు ఎమ్మెల్యేతో పాటు మరో 15 మందిని నిర్బంధించిన ఘటనను తీవ్రంగా ఖండించారు.
ప్రజా ప్రతినిధులకు సైతం స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు ఎన్ని రకాల దాడులు, దౌర్జన్యాలు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదన్నారు. వైఎస్సార్సీపీ పైనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. ఏపీలో పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. ఆలూరు సీఐ రవిశంకర్ ఎమ్మెల్యేను ఏకవచనంతో మాట్లాడడం అత్యంత హేయమని అని అన్నారు.


