Dallas: డాలస్‌లో ఉత్సాహంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం | international yoga day in dallas | Sakshi
Sakshi News home page

Dallas: డాలస్‌లో ఉత్సాహంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

Jun 24 2025 9:36 AM | Updated on Jun 24 2025 9:36 AM

international yoga day in dallas

డాలస్, టెక్సాస్: అమెరికాలోనే అతి పెద్దదైన ఇర్వింగ్ (డాలస్) నగరంలో నెలకొనియున్న మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద జూన్ 21 న మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో వందలాదిమంది ప్రవాస భారతీయులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. గంటన్నరకు పైగా సాగిన యోగా, ధ్యాన కార్యక్రమానికి ‘హార్ట్ ఫుల్నెస్’ యోగా సంస్థ సారధ్యం వహించింది. ఈ కార్యక్రమంలో ఇషా ఫౌండషన్, ది ఐ వై ఇసి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్, వన్ ఎర్త్ వన్ చాన్స్ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్, డి ఎఫ్ డబ్లు హిందూ టెంపుల్ మొదలైన సంస్థలనుండి వందలాదిమంది పాల్గొన్నారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక కార్యదర్శి రావు కల్వాల అతిథులందరికీ స్వాగతం పలికి, యోగా చెయ్యడం కోసం సుప్రభాత సమయంలో తరలివచ్చిన వారందరికీ ధన్యవాదములు అని సభను ప్రారంభించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ కో ఛైర్మన్ రాజీవ్ కామత్ శుభాకాంక్షలు తెలియజేశారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “యోగా, ధ్యానం కేవలం జూన్ 21 న మాత్రమేగాక మన దైనందిన జీవితంలో దినచర్యలో ఒక భాగంగా చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందన్నారు. భారత ప్రధాని పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకోవడం ఆనందదాయకం అన్నారు.”  

ముఖ్యఅతిథిగా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టాపర్ మహాత్మాగాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిలాఫలకాన్ని ఆవిష్కరించి, అన్ని వయస్సులవారు వందలాదిమంది ఈ రోజు యోగాలో పాల్గొనడం సంతోషం అని, ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిభావంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యవర్గ సభ్యులకు అభినందనలు అన్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మరియు కార్యవర్గసభ్యుల విజ్ఞప్తి ననుసరించి, అతిత్వరలో 5 మిలియన్ డాలర్లకు పైగా ధనాన్నివెచ్చించి ఈ 18 ఎకరాల సుందరమైన పార్క్ లో వాకింగ్ ట్రాక్స్, ఎల్ యి డి విద్యుత్ దీపాలను మెరుగుపరుస్తామని ప్రకటించడంతో అందరూ హర్షధ్వానాలు చేశారు.    

ప్రత్యేకఅతిథులుగా హాజరైన కాపెల్ నగర కౌన్సిల్ సభ్యులు బిజు మాథ్యూ, రమేష్ ప్రేమ్ కుమార్, ఫ్రిస్కో ఇండిపెండెంట్ స్కూల్ ట్రస్టీ బోర్డ్ సభ్యుడు సురేష్ మండువ ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమకెంతో సంతోషాన్ని కల్గించింది అంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర సహచర కార్యవర్గ సభ్యులు రాజీవ్ కామత్, రావు కల్వాల, బి.ఎన్ రావు, తయాబ్కుండావాల, రాజేంద్ర వంకావాల, రాంకీ చేబ్రోలు, మహేంద్ర రావు, జె పి పాండ్య, రన్నా జానీ, అనంత్ మల్లవరపులతో కలసి అతిథులందర్నీ సత్కరించారు.

యోగా అనంతరం నిర్వాహాకులు చక్కటి ఉపాహారాన్ని ఏర్పాటు చేశారు. గాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యుడు బి.ఎన్ రావు తన ముగింపు సందేశంలో యోగా కార్యక్రమంలో పాల్గొన్నవారికి, అతిథులకు, వివిధ ప్రసార మాధ్యమాలకు, హార్ట్ ఫుల్నెస్’ యోగా సంస్థ నిర్వాహాకులు సురేఖా కోయ, ఉర్మిల్ షా మరియు వారి బృంద సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement