పాకిస్తాన్‌ సెలబ్రిటీలకు బిగ్‌ షాకిచ్చిన భారత్‌ | Pakistan Social Media Celebrities Accounts Again Banned In India, Know Their Details Inside | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ సెలబ్రిటీలకు బిగ్‌ షాకిచ్చిన భారత్‌

Jul 3 2025 8:57 AM | Updated on Jul 3 2025 12:52 PM

Pakistan social media accounts AGain ban In India

ఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్‌కు చెందిన సెలబ్రిటీలకు భారత ప్రభుత్వం బిగ్‌ షాకిచ్చింది. పాక్‌ సెలబ్రిటీలు, క్రికెటర్లు సోషల్‌ మీడియా ఖాతాలపై కేంద్రం మళ్లీ నిషేధం విధించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌కు చెందిన పలు ఛానళ్లు, సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే, బుధవారం వారి అకౌంట్లు ప్రత్యక్షం కావడంతో సోషల్‌ మీడియాలో నెటిజన్ల విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, అప్రమత్తమైన కేంద్రం.. వారి ఖాతాలపై మళ్లీ నిషేధం విధించినట్లు సమాచారం.

ఇక, పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కు చెందిన యూట్యూబ్ ఛానెల్స్, సెలెబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు, పాకిస్తానీ క్రికెటర్ల ట్విట్టర్‌ అకౌంట్స్‌ అన్నింటినీ భారత్‌లో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో పాక్‌కు చెందిన పలు న్యూస్ ఛానెల్స్‌ను కూడా భారత్ బ్యాన్ చేసింది. అయితే బుధవారం నాడు ఈ ఛానెల్స్ అన్నీ భారత్‌లో ఆన్‌లైన్‌లో దర్శనం ఇచ్చాయి.

హనియా అమీర్, మహీరా ఖాన్, క్రికెటర్‌ షాహిద్ అఫ్రిది, మావ్రా హొకేన్, ఫవాద్ ఖాన్, సాబా కమర్, అహద్ రజా మిర్ వంటి పాక్ సెలెబ్రిటీల ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ ఖాతాలు భారత్‌లో అన్‌బ్లాక్ అయ్యాయి. పలు పాక్ న్యూస్ ఛానెల్స్ కూడా యూట్యూబ్‌లో దర్శనం ఇచ్చాయి. ఇవన్నీ చూసిన భారత నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. భారత్‌లో పాక్ ఛానెల్స్, సెలెబ్రిటీలపై బ్యాన్ తొలగించారా? అని పలువురు నెటిజన్లు సోషల్‌ మీడియాలో ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నుంచి ఈ విషయంలో ఎలాంటి ప్రకటన రాలేదు. నెటిజన్ల విమర్శల నేపథ్యంలో సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా మరోసారి నిషేధం విధించినట్టు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement