నిరాశపరిచిన ఆయుశ్‌ మాత్రే.. మరోసారి విధ్వంసం సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ | ENG U19 VS IND U19 2nd ODI: Vaibhav Suryavanshi Plays Yet Another Dashing Innings | Sakshi
Sakshi News home page

నిరాశపరిచిన ఆయుశ్‌ మాత్రే.. మరోసారి విధ్వంసం సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ

Jun 30 2025 6:44 PM | Updated on Jun 30 2025 7:43 PM

ENG U19 VS IND U19 2nd ODI: Vaibhav Suryavanshi Plays Yet Another Dashing Innings

14 ఏళ్ల భారత యువ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ ఇంగ్లండ్‌ గడ్డపై మరోసారి రెచ్చిపోయాడు. ఇంగ్లండ్‌ అండర్‌ 19 జట్టుతో ఇవాళ (జూన్‌ 30) జరుగుతున్న మ్యాచ్‌లో మరో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలి వన్డేలో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిస వైభవ్‌.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు. 

వైభవ్‌ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అర్హమైన హాఫ్‌ సెంచరీలను మిస్‌ చేసుకున్నాడు. మరోవైపు వైభవ్‌తో పాటు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన మరో ఐపీఎల్‌ సంచలన ఆయుశ్‌ మాత్రే ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. మాత్రే తానెదుర్కొన్న తొలి బంతికే డకౌటయ్యాడు (గోల్డెన్‌ డక్‌). మాత్రే వైభవ్‌ తరహాలో కాకపోయినా తొలి వన్డేలో పర్వాలేదనిపించాడు. ఆ మ్యాచ్‌లో అతను 30 బంతులు ఎదుర్కొని 4 ఫోర్ల సాయంతో 21 పరుగులు చేశాడు.

రెండో వన్డే విషయానికొస్తే.. ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అధికారికంగా తొలి బంతికే ఆయుశ్‌ మాత్రే (0) వికెట్‌ కోల్పోయిన భారత్‌.. ఆతర్వాత కుదురుకుంది. వైభవ్‌ సూర్యవంశీ (45), విహాన్‌ మల్హోత్రా (49), చవ్డా (22), అభిగ్యాన్‌ కుందు (32), రాహుల్‌ కుమార్‌ (47), కనిష్క్‌ చౌహాన్‌ (45) రాణించడంతో ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్‌ చేసింది. 

అయితే చివరి వరుస ఆటగాళ్లు వెంటవెంటనే ఔట్‌ కావడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ 49 ఓవర్లలో 290 పరుగుల వద్ద ముగిసింది (ఆలౌట్‌). ఇంగ్లండ్‌ బౌలర్లలో ఫ్రెంచ్‌ 4 వికెట్లు పడగొట్టగా..  జాక్‌ హోమ్‌, అలెక్స్‌ గ్రీన్‌ తలో 3 వికెట్లు తీశారు.    

కాగా, భారత అండర్‌-19 జట్టు 5 వన్డేలు, 2 టెస్ట్‌ మ్యాచ్‌ల కోసం  ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. నాటింగ్హమ్‌ వేదికగా ప్రస్తుతం రెండో వన్డే జరుగుతుండగా.. హోవ్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్‌ ఇంగ్లండ్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 42.2 ఓవర్లలో 174 పరుగులకే కుప్పకూలగా.. భారత్‌ కేవలం 24 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ పర్యటనలో భారత జట్టుకు ఆయుశ్‌ మాత్రే సారథ్యం వహిస్తున్నాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement