ENG VS IND 2nd Test: పాపం జైస్వాల్‌..! | ENG VS IND 2ND TEST DAY 1: YASHASVI JAISWAL MISSED A DESERVING HUNDRED BY JUST 13 RUNS | Sakshi
Sakshi News home page

ENG VS IND 2nd Test: పాపం జైస్వాల్‌..!

Jul 2 2025 8:07 PM | Updated on Jul 2 2025 8:51 PM

ENG VS IND 2ND TEST DAY 1: YASHASVI JAISWAL MISSED A DESERVING HUNDRED BY JUST 13 RUNS

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య రెండో టెస్ట్‌ ఇవాళ (జులై 2) ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోస​ం భారత్‌ మూడు మార్పులు చేయగా.. ఇంగ్లండ్‌ తొలి టెస్ట్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. భారత్‌ తరఫున బుమ్రా స్థానంలో ఆకాశ్‌దీప్‌.. సాయి సుదర్శన్‌ స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌.. శార్దూల్‌ ఠాకూర్‌ స్థానంలో నితీశ్‌ కుమార్‌ రెడ్డి తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న భారత్‌కు ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది. ఇన్‌ ఫామ్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ 2 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో రాహుల్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. రాహుల్‌ తర్వాత బరిలోకి దిగిన కరుణ్‌ నాయర్‌ కూడా తక్కువ స్కోర్‌కే (31) ఔటయ్యాడు. ఈ వికెట్‌ బ్రైడన్‌ కార్స్‌కు దక్కింది.‌ 

11వ హాఫ్‌ సెంచరీ
ఈ మధ్యలో యశస్వి జైస్వాల్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్‌కు టెస్ట్‌ల్లో ఇది 11వ అర్ద సెంచరీ. జైస్వాల్‌ తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. రాహుల్‌, కరుణ్‌ వికెట్లు కోల్పోయాక జాగ్రత్తగా ఆడిన జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించాడు.

పాపం​ జైస్వాల్‌
ఈ దశలో జైస్వాల్‌ ఓ అనవసర షాట్‌ ఆడి వికెట్‌ పారేసుకున్నాడు. బెన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌లో కట్‌ షాట్‌ ఆడే ప్రయత్నం చేయగా బంతి బాటమ్‌ ఎడ్జ్‌ తీసుకొని వికెట్‌కీపర్‌ జేమీ స్మిత్‌ చేతుల్లోకి వెళ్లింది. వికెట్‌ తీసిన ఆనందంలో స్టోక్స్‌ సంబరాలు చేసుకోగా.. జైస్వాల్‌  క్రీజ్‌లో అలాగే ఉండిపోయాడు. 

ఈ ఇన్నింగ్స్‌లో జైస్వాల్‌ చాలా సార్లు కట్‌ షాట్లు ఆడే ప్రయత్నం​ చేసి విఫలమయ్యాడు. చివరికి అదే షాట్‌ ఆడి వికెట్‌ పారేసుకున్నాడు. జైస్వాల్‌ 107 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసి పెవిలియన్‌ బాట పట్టాడు. జైస్వాల్‌ సెంచరీకి ముందు ఔట్‌ కావడంతో టీమిండియా అభిమానులు నిరాశపడ్డారు. పాపం జైస్వాల్‌ అంటూ సోషల్‌మీడియా వేదికగా సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

50 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 170/3గా ఉంది. శుభ్‌మన్‌ గిల్‌ 38, రిషబ్‌ పంత్‌ 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

కాగా, ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం భారత్‌ ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. లీడ్స్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్‌లో భారత్‌ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement