చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్‌ | IND VS AUS 2nd T20I: Harmanpreet Kaur Becomes Most Capped International Player In Women's Cricket | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్‌

Feb 19 2026 7:57 PM | Updated on Feb 19 2026 8:01 PM

IND VS AUS 2nd T20I: Harmanpreet Kaur Becomes Most Capped International Player In Women's Cricket

భారత మహిళా క్రికెట్‌ జట్టు సారధి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ చరిత్ర సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన టీ20 మ్యాచ్‌తో ఈ ఘనత సాధించింది. 

ఈ మ్యాచ్‌ కలుపుకొని హర్మన్‌ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లలో) 356 మ్యాచ్‌లు ఆడింది. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్‌ ప్లేయర్‌ సూజీ బేట్స్‌ పేరిట ఉండేది. సూజీ తన కెరీర్‌లో 355 మ్యాచ్‌లు ఆడింది. ఈ జాబితాలో హర్మన్‌, సూజీ తర్వాతి స్థానంలో ఆసీస్‌ ప్లేయర్‌ ఎల్లిస్‌ పెర్రీ ఉంది. పెర్రీ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు 349 మ్యాచ్‌లు ఆడింది.

హర్మన్‌ విషయానికొస్తే.. 2009 మార్చి 7న పాకిస్తాన్‌పై తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది.  ఇప్పటివరకు 6 టెస్టులు, 161 వన్డేలు, 189 T20ల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. 2016లో కెప్టెన్సీ చేపట్టిన హర్మన్‌, 2025 నవంబర్‌లో  వన్డే వరల్డ్ కప్ గెలిపించి కోట్లాది మంది భారతీయుల కలను సాకారం చేసింది. హర్మన్‌ తన కెరీర్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 8000కిపైగా పరుగులు సాధించింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్‌ 19 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. ఓపెనర్లు జార్జియా వాల్‌ (57 బంతుల్లో 88; 11 ఫోర్లు, సిక్స్‌), బెత్‌ మూనీ (39 బంతుల్లో 46; 4 ఫోర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవరల్లో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. తొలుత వాల్‌-మూనీ ధాటికి తడబడిన భారత బౌలర్లు.. చివరి 5 ఓవర్లలో అనూహ్యంగా పుంజుకున్నారు.

వాల్‌-మూనీ తొలి వికెట్‌కు 14.5 ఓవర్లలో 128 పరుగులు జోడించినా.. అరుంధతి రెడ్డి (4-0-20-2), శ్రీచరణి (3-0-28-0), రేణుకా ఠాకూర్‌ (4-0-27-1) ఊహించని విధంగా పుంజుకొని ఆసీస్‌ను భారీ స్కోర్‌ చేయకుండా నిలువరించారు. వాల్‌, మూనీ మినహా ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. లిచ్‌ఫీల్డ్‌ 6, ఎల్లిస్‌ పెర్రీ 7, గార్డ్‌నర్‌ 10 (నాటౌట్‌), జార్జియా వేర్హమ్‌ డకౌటయ్యారు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ను ఆసీస్‌ బౌలర్లు కలిసికట్టుగా రాణించి ఓడించారు. ఆష్లే గార్డ్‌నర్‌ (4-0-22-3), కిమ్‌ గార్త్‌ (3-0-16-2), అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ (4-0-18-2), సోఫీ మోలినెక్స్‌ (4-0-37-2) ధాటికి భారత్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. 

భారత ఇన్నింగ్స్‌కు షఫాలీ వర్మ (29), స్మృతి మంధన (31) శుభారంభం అందించినా, ఆతర్వాత వచ్చిన వారు ఆ ఊపును కొనసాగించలేకపోయారు. కెప్టెన్‌ హర్మన్‌ (36) కాసేపు పోరాడినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.

భారత ఇన్నింగ్స్‌లో పై ముగ్గురితో పాటు రిచా ఘోష్‌ (19), క్రాంతి గౌడ్‌ (12 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జెమీమా రోడ్రిగ్స్‌ (4), అమన్‌జోత్‌ (3), అరుంధతి రెడ్డి (2) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితం​ కాగా.. దీప్తి శర్మ, శ్రీచరణి ఖాతా కూడా తెరవలేకపోయారు.

కాగా, ఈ సిరీస్‌లో భారత్‌ తొలి టీ20లో 21 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో) విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 ఫిబ్రవరి 21న అడిలైడ్‌ వేదికగా జరుగనుంది. ఈ ఆసీస్‌ పర్యటనలో భారత్‌ టీ20ల తర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌, ఆతర్వాత ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ కూడా ఆడనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement