భారత్‌పై ప్రతీకారం తీర్చుకున్న ఆస్ట్రేలియా | Australia women beat team india in 2nd t20 by 19 runs | Sakshi
Sakshi News home page

భారత్‌పై ప్రతీకారం తీర్చుకున్న ఆస్ట్రేలియా

Feb 19 2026 5:48 PM | Updated on Feb 19 2026 6:02 PM

Australia women beat team india in 2nd t20 by 19 runs

మహిళల ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు స్వదేశంలో టీమిండియాతో మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ ఆడుతుంది. ఇందులో తొలుత 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభం కాగా.. భారత్‌ తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య జట్టుకు షాకిచ్చి తమ ఆధిక్యతను ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి ఆసీస్‌ రెండో మ్యాచ్‌లోనే ప్రతీకారం తీర్చుకుంది.

కాన్‌బెర్రా వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన రెండో టీ20లో ఆసీస్‌ 19 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. ఓపెనర్లు జార్జియా వాల్‌ (57 బంతుల్లో 88; 11 ఫోర్లు, సిక్స్‌), బెత్‌ మూనీ (39 బంతుల్లో 46; 4 ఫోర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవరల్లో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. తొలుత వాల్‌-మూనీ ధాటికి తడబడిన భారత బౌలర్లు.. చివరి 5 ఓవర్లలో అనూహ్యంగా పుంజుకున్నారు.

వాల్‌-మూనీ తొలి వికెట్‌కు 14.5 ఓవర్లలో 128 పరుగులు జోడించినా.. అరుంధతి రెడ్డి (4-0-20-2), శ్రీచరణి (3-0-28-0), రేణుకా ఠాకూర్‌ (4-0-27-1) ఊహించని విధంగా పుంజుకొని ఆసీస్‌ను భారీ స్కోర్‌ చేయకుండా నిలువరించారు. వాల్‌, మూనీ మినహా ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. లిచ్‌ఫీల్డ్‌ 6, ఎల్లిస్‌ పెర్రీ 7, గార్డ్‌నర్‌ 10 (నాటౌట్‌), జార్జియా వేర్హమ్‌ డకౌటయ్యారు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ను ఆసీస్‌ బౌలర్లు కలిసికట్టుగా రాణించి ఓడించారు. ఆష్లే గార్డ్‌నర్‌ (4-0-22-3), కిమ్‌ గార్త్‌ (3-0-16-2), అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ (4-0-18-2), సోఫీ మోలినెక్స్‌ (4-0-37-2) ధాటికి భారత్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. 

భారత ఇన్నింగ్స్‌కు షఫాలీ వర్మ (29), స్మృతి మంధన (31) శుభారంభం అందించినా, ఆతర్వాత వచ్చిన వారు ఆ ఊపును కొనసాగించలేకపోయారు. కెప్టెన్‌ హర్మన్‌ (36) కాసేపు పోరాడినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. భారత ఇన్నింగ్స్‌లో పై ముగ్గురితో పాటు రిచా ఘోష్‌ (19), క్రాంతి గౌడ్‌ (12 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జెమీమా రోడ్రిగ్స్‌ (4), అమన్‌జోత్‌ (3), అరుంధతి రెడ్డి (2) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితం​ కాగా.. దీప్తి శర్మ, శ్రీచరణి ఖాతా కూడా తెరవలేకపోయారు.

కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి టీ20లో 21 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో) విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 ఫిబ్రవరి 21న అడిలైడ్‌ వేదికగా జరుగనుంది. ఈ ఆసీస్‌ పర్యటనలో భారత్‌ టీ20ల తర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌, ఆతర్వాత ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ కూడా ఆడనుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement