మొట్ట మొదటి టి20 ప్రపంచకప్ ఆడుతున్న టీమిండియా విధ్వంకర ఓపెనర్ అభిషేక్ శర్మ తర్వాతి మ్యాచ్ల్లో ఆడతాడా, లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లీగ్ మ్యాచ్ల్లో తీవ్రంగా నిరాశపరిచిన ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్కు సూపర్- 8 మ్యాచ్ల్లో ఆడే అవకాశం రాకపోవచ్చన్న వార్తలు వస్తున్నాయి. అతడి స్థానంలో సంజూ శామ్సన్ను తీసుకుంటారని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వరుసగా మూడుసార్లు డకౌట్ కావడంతో అభిషేక్పై వేటు తప్పదని భావిస్తున్నారు.
లీగ్ దశలో నమీబియాతో జరిగిన మ్యాచ్కు అభిషేక్ దూరం కావడంతో సంజూకు అవకాశం దక్కింది. ఈ మ్యాచ్లో 8 బంతుల్లో 22 పరుగులు చేశాడు శామ్సన్. అయితే వరల్డ్కప్ టీమ్లో చోటు దక్కించుకున్న తర్వాత సంజూ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. వచ్చిన ఒక అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. గత కొన్నాళ్లుగా భారీ స్కోరు చేయడంలో విఫలమవుతున్నాడు. అయితే అభిషేక్ వైఫల్యం సంజూకు కలిసొచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు వరుస వైఫల్యాలతో సతమతవుతున్న అభిషేక్ కంటే సంజూయే కాస్త బెటరన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 22న అహ్మదాబాద్లో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్లో సంజూకు చాన్స్ రావొచ్చని ఆశిస్తున్నారు. కాగా, టాపార్డర్లో ముగ్గురు లెఫ్టాండర్ బ్యాలర్లే ఉండడం సమస్యేనని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డష్కాటే అంగీకరించడం గమనార్హం. ఈ నేపథ్యంలో టీమ్ మేనేజ్మెంట్, హెడ్ కోచ్ గంభీర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.
అటు బౌలింగ్లోనూ వరుణ్ చక్రవర్తి మినహా మిగతా స్పిన్నర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సూపర్-8 మ్యాచ్ల్లో బౌలర్లు సమిష్టిగా రాణిస్తేనే టీమిండియా ఆధిపత్యం కొనసాగుతుందని విశ్లేషకులు అంటున్నారు. తర్వాతి మ్యాచ్కు వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ (Axar Patel) జట్టులోకి వచ్చే అవకాశముంది. రింకు సింగ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ను ఆడిస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా క్రీడాభిమానుల్లో నడుస్తోంది. బౌలింగ్తో పాటు లోయర్ ఆర్డర్గా బ్యాటింగ్ చేయగల సత్తా వాషింగ్టన్ సుందర్కు ఉంది.
చదవండి: అతడిని కావాలనే తొక్కేస్తున్నారా?
భారత జట్టు అంచనా: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.


