క్రికెట్ మైదానంలో పెను విషాదం చోటు చేసుకుంది. తేనెటీగల దాడిలో ఓ ఫీల్డ్ అంపైర్ ప్రాణాలు కోల్పోయాడు. 15-20 మంది ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాద ఘటన కాన్పూర్లోని (ఉత్తర్ప్రదేశ్) శుక్లగంజ్ సప్రూ మైదానంలో బుధవారం చోటు చేసుకుంది.
స్థానికంగా అండర్-13 మ్యాచ్ జరుగుతున్న సమయంలో తేనెటీగల గుంపు ఒక్కసారిగా మైదానంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో అంపైరింగ్ చేస్తున్న 65 ఏళ్ల మాణిక్ గుప్తాను తేనెటీగలు అలుముకున్నాయి. ఈ ఘటనలో గుప్తా ప్రాణాలు కోల్పోయారు. ఊహించని ఈ ఘటన క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

తేనెటీగలు అంపైర్ గుప్తాతో పాటు మరో ఫీల్డ్ అంపైర్ జగదీశ్ శర్మపై కూడా దాడి చేశాయి. అలాగే మ్యాచ్ ఆడుతున్న 15–20 మంది ఆటగాళ్లను కూడా చుట్టుముట్టాయి. గుప్తాను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరో అంపైర్ జగదీశ్ శర్మకు అత్యవసర చికిత్స అందించగా.. ప్రస్తుతం అతను ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డాడు. అస్వస్థతకు గురైన ఆటగాళ్ల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది.
ఊహించిన ఈ ఘటనపై కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.ఎన్. సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుప్తాను ఆసుపత్రికి తరలించే సమయంలో కూడా తేనెటీగలు ఆయన ముఖం, శరీరానికి అంటిపెట్టుకుని ఉన్నాయని ఆయన వాపోయారు. గుప్తాకు స్థానిక క్రికెట్లో అనుభవజ్ఞుడైన అంపైర్గా పేరుంది.
తేనెటీగల దాడులు కొత్తేమీ కాదు
క్రికెట్లో తేనెటీగల దాడులు కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఇలాంటి దాడులు జరిగాయి. అయితే భారత్లో ప్రాణనష్టం మాత్రం ఎప్పుడూ సంభవించలేదు. కాన్పూర్ ఘటనే తొలిసారి.
గతేడాది తమిళనాడు ప్రీమియర్ లీగ్ సందర్భంగా కూడా ఇదే తరహాలో తేనెటీగల దాడి జరిగింది. ఆ ఘటనలో పలువురు ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు.
2019లో త్రివేండ్రం గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో ఇండియా ఏ-ఇంగ్లండ్ లయన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా కూడా తేనెటీగలు దాడి చేశాయి. ఆ సందర్భంలో స్టేడియంలోని చాలామంది ప్రేక్షకులు తేనెటీగల దాడికి గురై అసుపత్రిపాలయ్యారు.


