చెవిరెడ్డిపై ఉప్పొంగిన అభిమానం
తిరుపతి రూరల్: తమ అభిమాన నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చూసేందుకు భాకరాపేట, ఎర్రావారిపాళెం, నెరబైలు ప్రాంతాల్లో శనివారం వందలాది మంది జనం తరలి వచ్చారు. మహిళలు అభిమానంతో హారతులు పట్టి వీర తిలకం దిద్దారు. గజమాలలు, మంగళవాయిద్యాలు.. పెద్ద ఎత్తున బాణా సంచా పేలుళ్ల మధ్య జనం నీరాజనాలు పలికారు. ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినం తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నుంచి తలకోన శ్రీసిద్ధేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. అందులో భాగంగా శనివారం రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తలకోన సిద్ధేశ్వరస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి దంపతులకు భాకరాపేట, ఎర్రావారిపాళెం, నెరబైలు ప్రాంతాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. చెవిరెడ్డిని చూడగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో జేజేలు పలికారు. భారీ ఎత్తున బాణా సంచా పేల్చుతూ చెవిరెడ్డిపై పూలవర్షం కురిపించారు. నెరబైలు గ్రామంలో సుమారు ఒక కిలోమీటరు మేరకు ఒక గంట పాటు నడుచుకుంటూ వచ్చిన చెవిరెడ్డికి మహిళలు హారతులు పట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. భారీ జన సందోహం నుంచి కొంత దూరం నడిచిన చెవిరెడ్డి ఆ తరువాత కారులో తలకోన చేరుకున్నారు. ఆలయం వద్ద అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చెవిరెడ్డి కుటుంబసభ్యులకు వేద ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రావారిపాళెం మండలానికి చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చెవిరెడ్డిపై ఉప్పొంగిన అభిమానం


