తిరుపతి అన్నమయ్య సర్కిల్ : బస్సు ప్రమాదాల నేపథ్యంలో మోటార్ వాహన తనిఖీ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా రవాణా శాఖ అధికారి కొరప్రాటి మురళీమోహన్ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట, రేణిగుంట ప్రాంతాల్లో వారం రోజులుగా కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై తనిఖీలు చేపట్టారు. 1,100 బస్సులను పరిశీలించి నిబంధనలను ఉల్లంఘించిన 122 బస్సులపై కేసులు నమోదు చేశారు. అదేవిధంగా ఏఐఎస్ 119 నిబంధనలు ఉల్లంఘించిన 6 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అన్ని వాహనాలపై మొత్తం రూ.16 లక్షల జరిమానా, పన్నులు వసూలు చేశారు. జిల్లా రవాణా శాఖ అధికారి మాట్లాడుతూ అన్ని స్లీపర్ బస్సులు తప్పనిసరిగా ఆటోమోటివ్ ఇండియన్ స్టాండర్స్ (ఏఐఎస్ 052, ఏఐఎస్ 119) నిబంధనలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా అత్యవసర ద్వారాలు ఉండాలని, అలాగే డ్రైవర్లు అతివేగంగా వాహనాలను నడపరాదని హెచ్చరించారు. శుక్రవారం బెంగళూరు నుంచి గౌహతి వెళ్తున్న ఒక స్లీపర్ బస్సులో పరిమితికి మించి 25 మంది ప్రయాణికులు ఉండడం, అలాగే అత్యవసర ద్వారాలు లేకపోవడాన్ని గమనించిన మోటార్ వాహన తనిఖీ అధికారి వనం వెంకటసుబ్రహ్మణ్యం వాహనాన్ని సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో మోటార్ వాహన తనిఖీ అధికారులు దామోదర్ నాయుడు, శ్రీనివాసరావు, చంద్రశేఖర్, అతికానాజ్, మోహన్ కుమార్, రమణ నాయక్, ఆంజనేయ ప్రసాద్, వర్మ పాల్గొన్నారని వివరించారు.


