కలువాయి(సైదాపురం) : కలువాయి తెలుగుగంగ ప్రాజెక్టు అతిథి గృహాన్ని శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి వసుమతి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆదేశాల మేరకు నిరుపయోగంగా ఉన్న అతిథి గృహంలో అన్ని వసతులు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే అతిథి గృహాన్ని పరిశీలించినట్టు పేర్కొన్నారు. ఆమె వెంట ఎంపీడీవో శైలజ, ఇన్చార్జి డిప్యూటీ ఎంపీడీవో రమేష్, ఇన్చార్జి పంచాయతీరాజ్ ఏఈ శివారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు సుధాకర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
రైల్వే కోడూరు ఘటనపై కేసు నమోదు
రైల్వే కోడూరు అర్బన్: రైల్వే కోడూరులో గురువారం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై దాడిచేసిన వారిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. అరవ శ్రీధర్ బాధితురాలు, అతని అనుచరుడిపై గురువారం జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర, అతని అనుచరులు దాడిచేసిన విషయం విదితమే. ఈ ఘటనపై బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమేరకు తాతంశెట్టి నాగేంద్ర, మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కాగా తనపై దాడిచేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదుచేయాలని బాధితురాలు డిమాండ్ చేస్తున్నారు.


