భక్తుడిపై టీటీడీ సిబ్బంది దురుసు ప్రవర్తన | TTD staff rude behavior towards a devotee | Sakshi
Sakshi News home page

భక్తుడిపై టీటీడీ సిబ్బంది దురుసు ప్రవర్తన

Feb 9 2026 3:47 AM | Updated on Feb 9 2026 3:47 AM

TTD staff rude behavior towards a devotee

పరుష పదజాలంతో దూషణ..ఆపై భౌతిక దాడి 

తిరుచానూరు అమ్మవారి ఆలయంలో ఘటన

చంద్రగిరి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ సిబ్బంది తీరు పలు వివాదాలకు దారితీస్తోంది. విజయవాడకు చెందిన పృథ్వీ ఆదివారం అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయానికి వచ్చాడు. రూ.50 టికెట్‌ తీసుకుని క్యూలో దర్శనానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన తన బ్యాగ్‌లో సెల్‌ఫోన్‌ ఉంచుకున్నాడు. లగేజీ స్కానింగ్‌ వద్ద ఆలయ సిబ్బంది పృథ్వీ బ్యాగ్‌లో సెల్‌ఫోన్‌ను గుర్తించి, అతడిని అడ్డుకుని, సెల్‌ఫోన్‌ను లాకర్‌లో ఉంచి రావాలని సూచించారు. 

క్యూలో ప్రవేశించే సమయంలో తనను ఎవరూ తనిఖీ చేయలేదని, సెల్‌ఫోన్‌ నిషేధం గురించి తనకు తెలియదని వారికి పృథ్వీ చెప్పాడు. ఆపై సిబ్బంది సూచనల మేరకు అత్యవసర గేటు నుంచి వెళ్లి సెల్‌ఫోన్‌ను లాకర్‌లో ఉంచాడు. అనంతరం అత్యవసర గేటు వద్దకు వచ్చి దర్శనానికి అనుమతించాలని సిబ్బందిని కోరాడు. అయితే ఇక్కడి నుంచి పంపించడం కుదరదని, తిరిగి క్యూలో రావాలని పృథ్వీకి సిబ్బంది చెప్పారు. 

గంటకు పైగా క్యూలైన్‌లో ఉండి తాను ఇక్కడ వరకు వచ్చానని, సెల్‌ఫోన్‌ ఉండడంతో మీ సూచనల మేరకు ఫోన్‌ను లాకర్‌లో ఉంచి వచ్చానని పృథ్వీ చెబుతున్నా అక్కడి సిబ్బంది వినలేదు. ఈ క్రమంలో అక్కడే విధుల్లో ఉన్న ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ తనపై బూతులతో రెచ్చిపోయాడని బాధితుడు వాపోయాడు. పరుష పదజాలంతో దూషిస్తూ తనపై దౌర్జన్యానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశాడు. 

తనను ఎందుకు బూతులు తిడుతున్నారని ప్రశ్నించగా.. అక్కడున్న సిబ్బంది అంతా తనను కొట్టి, బయటకు గెంటివేశారని వివరించాడు. తనపై దాడికి పాల్పడిన సిబ్బందిపై టీటీడీ చర్యలు తీసుకోవాలని, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులపై ఇలా దాడులు చేసి, టీటీడీ ప్రతిష్టను దిగజార్చుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.  

Advertisement
 
Advertisement
Advertisement