ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్
మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక, ప్రమాణస్వీకారం
సాక్షి, అమరావతి/గాంధీనగర్(విజయవాడసెంట్రల్) : పీఆర్సీ ఇప్పటికే చాలా ఆలస్యమైందని ఆ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు విద్యాసాగర్ చెప్పారు. పీఆర్సీ కమిషన్కు చైర్మన్ను నియమించే వరకూ వెనుకడుగు వేసేదిలేదన్నారు. ఏపీ ఎన్జీవో సంఘం నూతన కార్యవర్గానికి ఆదివారం విజయవాడలో జరిగిన ఎన్నికలు ఏకగ్రీవం అవగా రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి ఆలపర్తి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శిగా డీవీ రమణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వారితోపాటు నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం గాం«దీనగర్లోని జింఖానా గ్రౌండ్స్లో జరిగింది. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చట్టబద్ధంగా లభించాల్సిన ప్రతి హక్కును పరిరక్షించేందుకు తమ సంఘం కట్టుబడి ఉందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు అలాగే ఉన్నాయని, సీపీఎస్ ఉద్యోగుల సమస్యలు సైతం పరిష్కారం కాలేదన్నారు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలంటే ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఉద్యోగుల బకాయిలు కొండ లాగా పేరుకుపోయాయని వాటిని తగ్గించుకునేందుకు ప్రభుత్వంతో మాట్లాడుతున్నట్టు తెలిపారు.
ఈ నెల 10వ తేదీన ఉద్యోగ జేఏసీ సెక్రటేరియట్ సమావేశం ఏర్పాటు చేశామని, ఉద్యోగులు, ఉపాధ్యాయులతో జేఏసీని పునవ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఏ ఉద్యమం చేసినా బారికేడ్లను తన్నుకుని ముందుకు సాగుతామని తెలిపారు. తొలుత విద్యాసాగర్, డీవీ రమణలు నగరంలోని పాత బస్టాండ్ ప్రాంగణం నుంచి గాం«దీనగర్లోని రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్లు దాఖలు చేశారు.


