అప్రమత్తంగా ఉండాలి
తిరుపతి అన్నమయ్య సర్కిల్: అప్రమత్తంగా విధులు నిర్వర్తించడంతోపాటు అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే ఐజీ, ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ కమిషనర్ అరోమా సింగ్ ఠాకూర్ సూచించారు. శనివారం ఆయన తిరుపతిలోని ఆర్పీఎఫ్ బ్యారక్ను సందర్శించారు. ఆర్పీఎఫ్ ఆమృత్ గీత్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బందితో సురక్షా సమ్మేళనం నిర్వహించారు. సిబ్బంది సమస్యలను తెలుసుకుని, రైల్వే సంక్షేమ పథకాల గురించి తెలిపారు. మానసిక ప్రశాంతత, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలని సూచించారు. చైల్డ్లైన్–1098, వన్ స్టాప్ సఖి సెంటర్, బచ్పన్ బచావో ఆందోళన్ ప్రతినిధులతో సమావేశమై, రన్ అవే, మిస్సింగ్ పిల్లల రక్షణలో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆర్పీఎఫ్ డ్రై కాంటీన్, డాగ్ స్క్వాడ్ను పరిశీలించి, వాయు, ప్రిన్స్ సేవలను ప్రశంసించి, వాటి సంరక్షణపై సూచనలు ఇచ్చారు. ఆర్పీఎఫ్ పోస్ట్ తిరుపతిలో రికార్డులు పరిశీలించి సమయానుకనుణంగా నవీకరించాలని, నేర నియంత్రణ కోసం జాతీయ డిజిటల్ పోర్టల్స్ వినియోగాన్ని పెంచాలని ఆదేశించారు. ముందుగా ఐజీ అరోమాసింగ్ ఆర్పీఎఫ్ బ్యారక్ ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం అదికార సిబ్బంది ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్–2026 ను అందుకున్న అరోమా సింగ్ను సత్కరించారు.


