ఆ పాపం.. ఇంటి దొంగలదేనా?
డీఎంఏలోని డీఈఓ సహకారంతోనే...
డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో రెవెన్యూ లాగిన్ వ్యవహారాలను ఆపరేట్ చేస్తున్న ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారానే మ్యుటేషన్ను గుట్టు చప్పుడు కాకుండా సాగిస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. ఒకరి ఇద్దరు వ్యక్తులు డీఎంఈలోని డీఈఓల ద్వారా కార్పొరేషన్ రెవెన్యూ విభాగానికి సంబంధం లేకుండానే అసెస్మెంట్లో మార్పు చేర్పులు చేయిస్తున్నట్లు సమాచారం. కూటమి పంచన చేరిన ఓ కార్పొరేటర్ భర్త సైతం ఓ నెట్ సెంటర్ ద్వారా మ్యుటేషన్ను చేయిస్తున్నట్లు కార్పొరేషన్ అధికారులకు తెలిసినా తమకేమి సంబంధం లేదన్నట్టు సైలెంట్ అయిపోయారు.
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం
తిరుపతి తుడా: మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ విభాగంలో మ్యుటేషన్ (అసెస్మెంట్లో యజమాని పేరు మార్పులు) వ్యవహా రం ఇంటి దొంగల పనేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాగిన్పై పూర్తి అవగాహన ఉన్న ఒకరిద్దరూ బయట ఇంటర్నెట్ సెంటర్ లేదా ఇంటి వద్ద కంప్యూటర్ని ఏర్పాటు చేసుకుని అసెస్మెంట్లో మార్పు చేర్పులు వ్యవహారాన్ని గుట్టుగా చేస్తున్నారన్న ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇంటి దొంగల ప్రమేయం లేకుండా సీడీఎంఏ లాగిన్లో పేర్లు మార్చడం అసాధ్యమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో కమిషనర్ తిరుపతి ఎస్పీకి ప్రాథమికంగా ఫిర్యాదు చేశారు. దీనిపై లోతైన విచారణ జరిపి మ్యుటేషన్ దొంగలను పట్టుకోవాలని ఆమె కోరారు. ఈ క్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య శనివారం రాత్రి పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
డీఎంఏకు ఫిర్యాదు
డిప్యూటీ కమిషనర్ అమరయ్య శుక్రవారం అమరావతికి వెళ్లి డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్కు లాగిన్ దొంగల వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. అధికారులకు ఏమాత్రం సంబంధం లేకుండా మ్యుటేషన్ జరుగుతోందని ఆయన ఆధారాలను కమిషనర్కు అందజేశారు. డీఎంఏలో ఒకరిద్దరికి తెలిసే ఈ అక్రమ వ్యవహారం సాగుతోందన్న సమాచారం ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ విభాగానికి సంబంధించిన లాగిన్ను మరింత పటిష్టం చేయాలని ఆయన కమిషనర్ను కోరారు.
ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడిన ఓ మహిళ తన ఇంటి పన్నులో పేరు మారడాన్ని గుర్తించి ఇటీవల కమిషనర్ మౌర్యకు ఫిర్యాదు చేశారు. తన సొంత తమ్ముడే ఈ పని చేసినట్లు ఆమె ఆధారాలతో సహా స్పందనలో ఫిర్యాదు చేశారు. పన్నులు యజమాని పేరు మారడంపై కమిషనర్ లోతుగా ఆరా తీశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి డిప్యూటీ కమిషనర్ వరకు ఎక్కడ సంబంధిత ఫైల్ లేకుండానే పేరు మారిన విషయాన్ని అధికారులు గుర్తించారు. ఇలా అసెస్మెంట్లో యజమాని పేరు ఎలా మారిందని, రెవెన్యూ సెక్షన్కు సంబంధం లేకుండా ఎలా సాధ్యమైంది అన్నదానిపై కూపీలాగారు. ఎంతకీ ఆ మ్యుటేషన్ దొంగ దొరక్క పోవడంతో కమిషనర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంతోనే మ్యుటేషన్ గుట్టు రట్టు అయింది.
లాగిన్పై అవగాహన ఉన్న వ్యక్తులే..
కార్పొరేషన్ రెవెన్యూ విభాగం లాగిన్పై అవగాహన ఉన్న వారే దొ డ్డిదారిలో మ్యుటేషన్ను పెంచిపోషిస్తున్నారన్న ఆరోపణలు వినిపి స్తున్నాయి.యజమాని పేరు మార్చేస్తే రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నారు. కొంతమంది సిబ్బందికి ఈ వ్యవహారం పెద్ద ఆదాయపు వనరుగా మారింది. అక్రమ సంపాదనకు అ లవాటు పడిన లాగిన్ దొంగలతోపాటు ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. గతంలో కమిషనర్ లాగిన్ల ను దుర్వినియోగం చేసిన చరిత్ర కార్పొరేషన్ కంప్యూటర్ ఆపరేటర్లదే. ఈ వ్యవహారంలో ఒకరిద్దరు ఇప్పుడు బయట కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇంటా బయటా ఉన్న సాఫ్ట్వేర్, ప్రభుత్వ లాగిన్పై పట్టు ఉన్న వారే అసెస్మెంట్లో యజమాని పేర్లు మార్చేస్తున్నారన్న సమాచారం కమిషనర్ వద్ద ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వెస్ట్ సీఐ అనిల్ కుమార్ తెలిపారు.
ఆ పాపం.. ఇంటి దొంగలదేనా?


