20 శివాలయాలకు భారీ సారె
శ్రీకల్యాణ వెంకన్న ఆలయం నుంచి
చెవిరెడ్డి సారె సమర్పణ
ఉదయం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయాల సందర్శన
చెవిరెడ్డి మోహిత్రెడ్డి, హర్షిత్రెడ్డికి సాదర స్వాగతం
తిరుపతి రూరల్: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చంద్రగిరి నియోజక వర్గంలోని మూడు మండలాల పరిధిలోని పురాతన 20 శివాలయాలకు తుమ్మలగుంట శ్రీకల్యాణ వెంకన్న ఆలయం నుంచి భారీగా సారె అందజేశారు. తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి సారె సమర్పణ చేశారు. ఆనవాయితీ మేరకు ఆదివారం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 20 శివాలయాలను దర్శించి, సారె సమర్పించారు. మొదట తలకోన శ్రీసిద్ధేశ్వర స్వామిని దర్శించి ఆ తరువాత చెవిరెడ్డి మోహిత్రెడ్డి, హర్షిత్రెడ్డి సారె సమర్పణ కార్యక్రమం మొదలు పెట్టారు. చంద్రగిరి మండలం నారావారిపల్లి శ్రీశేషాచల లింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ పుట్టాలమ్మ ఆలయం, శ్రీ నాగాలమ్మ ఆలయం, శ్రీమల్లికార్జున స్వామి ఆలయం, శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయాలకు పట్టువస్త్రాలు అందజేసి స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. తిరుపతి రూరల్ మండలంలోని పైడిపల్లి శ్రీకాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, సి.గొలపల్లి వద్దనున్న నీలకంఠేశ్వర ఆలయం, చిగురువాడ స్వర్ణముఖి ఒడ్డునున్న పార్వతీ పరమేశ్వర ఆలయం, దుర్గసముద్రం వల్మీకేశ్వర ఆలయం, అడపారెడ్డిపల్లి వద్దనున్న శివగిరి క్షేత్రంలోని నాగేశ్వరస్వామి ఆలయం, అవిలాల కపిలేశ్వరస్వామి ఆలయం, మంగళంలోని పరమేశ్వరస్వామి ఆలయాలకు పట్టువస్త్రాలను అందజేశారు. తిరుచానూరు పంచాయతీ యోగిమల్లవరం వద్దనున్న ప్రాచీన శ్రీపరాశరేశ్వర స్వామి ఆలయంకు పట్టువస్త్రాలు సమర్పించి స్వామి దర్శనం చేసుకున్నారు. చివరగా రామచంద్రాపురం మండలంలోని రేకలచేను వద్దనున్న జన్మస్థల పరమేశ్వరస్వామి ఆలయం, బొప్పరాజుపల్లి బుగ్గ మల్లేశ్వరస్వామి ఆలయం, రాయల చెరువు వద్దనున్న శ్రీభవానీ జలకంఠేశ్వరస్వామి ఆలయం, గంగిరెడ్డిపల్లి వద్దనున్న వీరబ్రహ్మంగారి ఆలయాలకు సారెను అందజేశారు.
సాదర స్వాగతం
శివాలయాలకు సారెను తెచ్చిన చెవిరెడ్డి మోహిత్రెడ్డిని ఆయా గ్రామాల్లోని పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు ఆయన వెంట రాగా అందరికీ దర్శన ఏర్పాట్లు చేయించారు. తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి శైవాలయాలకు సారెను అందజేసే బృహత్తర కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చేతుల మీదుగా 14 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతోంది.
20 శివాలయాలకు భారీ సారె


