మహిళా వర్సిటీలో వికాస్–2026
–హాజరుకానున్న యూజీసీ కార్యదర్శి
తిరుపతి రూరల్: తిరుపతి శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం వేదికగా వికాస్– 2026ను ఘనంగా నిర్వహించనున్నట్టు సదస్సు కోఆర్డినేటర్లు ప్రొఫెసర్ విద్యావతి, ప్రొఫెసర్ శోభారాణి తెలిపారు. గురువారం వర్శిటీలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వికాస్– 2026 సదస్సులో ‘‘పరిశ్రమ జ్ఞానం, అప్రెంటీస్ షిప్, స్కిల్లింగ్ వైపు అడుగులు’’ అనే అంశంపై ఒక్క రోజు సదస్సును నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సదస్సుకు యూజీసీ కార్యదర్శి మనీష్ జోషి, సంయుక్త కార్యదర్శి డా. అవిచల్ కపూర్ , ఉన్నత విద్యా మండలి వైస్ చైర్ పర్సన్ ప్రొ ఎస్.విజయభాస్కర్ రావు, వైస్ చాన్సలర్ ఆచార్య ఉమ హాజరై ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఉన్నత విద్యా సంస్థలను జాతీయ అభివృద్ధి, సామాజిక పరివర్తనకు కేంద్రాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సదస్సు జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సుకు ఆంధ్ర ప్రదేశ్లోని అన్ని విశ్వవిద్యాలయాలు, స్వయం ప్రతిపత్తి కళాశాలల నుంచి నిపుణులు, పరిపాలనా అధికారులు హాజరవుతారని చెప్పారు.
లారీ ఢీకొని ఒకరి మృతి
కలువాయి(సైదాపురం): కలువాయి మండలంలోని గురువారం లారీ ఢీకొనడంతో జాతీయ దాటుతున్న ఓ వ్యక్తి మృతిచెందాడు. శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసారగం మండలం ఉప్పలపాడు గ్రామనికి చెందిన భాగాది నరసింహులు(38)గా పది రోజుల క్రితం మాదన్నగారిపల్లెలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. గురువారం మాదన్నగారిపల్లె వద్ద జాతీయ రహదారి దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ లారీని సంఘటన స్థలంలో వదిలి పరారయ్యాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 68,586 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,764 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.71 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
మహిళా వర్సిటీలో వికాస్–2026


