నేడు పీజీఆర్ఎస్ రద్దు
తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించాల్సి ఉన్న పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)ను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం(8వ తేదీ) ఉదయం 10.30 గంటల నుంచి రాష్ట్ర సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లు, డివిజన్ స్థాయి అధికారులు, తహశీల్దార్లుతో సమీక్ష ఉందని తెలిపారు. ఈ క్రమంలో పీజీఆర్ఎస్ను సోమవారం రద్దు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాన్ని జిల్లా ప్రజలు గుర్తించాలని వివరించారు.
ధ్వనులపై పరిశోధకుల అధ్యయనం
ఏర్పేడు: మండలంలోని జంగాలపల్లి సమీపంలోని తిరుపతి ఐసర్లో వారం రోజులపాటు అడ్వాన్స్డ్ బయో అకౌస్టిక్స్ వర్క్షాపు ముగిసింది. న్యూయార్క్కు చెందిన కార్నెల్ విశ్వవిద్యాలయం కెలిసా యాంగ్ సెంటర్ ఫర్ కన్జర్వేషన్ బయోఅకౌస్టిక్స్ సహకారంతో జరిగిన ఈ శిబిరంలో జంతు, మానవుల ధ్వనుల అధ్యయనాలపై పరిశోదకులు పవర్పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. వర్క్షాప్లో భాగంగా ఆదివారం రేణిగుంట మండలం మామండూరు అటవీ క్షేత్రాన్ని పర్యటించి, అక్కడ వృక్షాలపై ఉన్న జంతుజాలాల ధ్వనులపై అధ్యయనం చేశారు.
శ్రీవారి దర్శనానికి
18 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 81,777 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,209 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.7 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.
ఘనంగా స్పోర్ట్స్ డే
తిరుపతి తుడా: స్విమ్స్ 33వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని యూనిఫెస్ట్–2026 పేరుతో స్పోర్ట్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఆదివారం స్విమ్స్ క్రీడా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్తోపాటు శాప్ చైర్మన్ రవినాయుడు ముఖ్యఅతిథులుగా పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మట్లాడుతూ స్విమ్స్ 33వ వార్షికోత్సవం సందర్భంగా నెల రోజులుగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అందుతో భాగంగా స్పోర్ట్స్ డేని నిర్వహించామన్నారు. క్రీడాపోటీలలో పాల్గొని ప్రతిభ చూపిన వైద్యులు, ఉద్యోగులు, విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీన్ అలోక్ సచిన్, రిజిస్ట్రార్ అపర్ణ ఆర్ బిట్లా, ప్రిన్సిపల్ డాక్టర్ ఉషాకలవత్, స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ సుభాష్, వైద్యాధికారులు, అధికారులు పాల్గొన్నారు.
నేడు పీజీఆర్ఎస్ రద్దు


