రేణిగుంట: పట్టణంలోని రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠం ఆలయ ఆవరణలో 18 అడుగుల ఏకశిలా హనుమంత విగ్రహ ప్రతిష్టను అడ్డుకోవడం హైందవధర్మానికి విరుద్ధమని ఆలయ పీఠాధిపతి మూర్తి స్వామి మండిపడ్డారు. రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠం ఆలయ ఆవరణలో విగ్రహ ప్రతిష్టకు శ్రీకారం చుట్టారు. మూడు రోజుల పాటు జరిగే విగ్రహ ప్రతిష్ట, మహా కుంభాభిషేక వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఆలయ పీఠాధిపతి మూర్తిస్వామి ఆధ్వర్యంలో తిరుచానూరు నుంచి హనుమంతుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో గాజుల మండ్యం పోలీసులు ఆలయం వద్దకు చేరుకుని విగ్రహ ఊరేగింపు, ప్రతిష్టాపనకు అనుమతి లేదని ఆదేశించడంతో ఆలయ పీఠాధిపతి మూర్తి స్వామి, హోమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మూర్తి స్వామి మాట్లాడుతూ హనుమంతుని విగ్రహ ప్రతిష్టాపనను పోలీసులు అడ్డుకోవడం హైందవ ధర్మానికి విరుద్ధంగా ఉందని అన్నారు. 16 దేశాల్లో అనేక ఆశ్రమాలను స్థాపించిన తనపై ఇలా పోలీసులు కక్ష కట్టడం దారుణం అన్నారు. సనాతన ధర్మ రక్షణ అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. హింధువుల ఆరాధ్య దైవమైన హనుమంతుడి విగ్రహ ప్రతిష్టను ఎవరు అడ్డుకున్న ఆపేది లేదన్నారు. విజయలక్ష్మి మాట్లాడుతూ సనాతన ధర్మంపై ఎంతో భక్తిభావంతో ప్రైవేటు ట్రస్టు స్థలంలో సొంత నిధులతో విగ్రహాన్ని ప్రతిష్టిస్తుంటే అడ్డుకోవడం శోచనీయమన్నారు.


