ఎమ్మెల్యే గారూ..అసెంబ్లీలో మాట్లాడండి
తిరుపతి అర్బన్: ‘ఎమ్మెల్యే గారూ.. అసెంబ్లీ సమావేశాల్లో...ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడండి సార్..ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో అయ్యోర్లో సమస్యలు పేరుకుపోతున్నాయి. ఒక్క సమస్యకు పరిష్కారం దొరకడం లేదు.’ అంటూ శనివారం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు యూటీఎఫ్ జిల్లా కమిటీకి చెందిన ఉపాధ్యాయులు మొరపెట్టుకున్నారు. పీఆర్సీ కమిషన్ నియమించాలని, 29 శాతం ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, ఉద్యోగుల పెన్షన్ బకాయిలు చెల్లింపునకు రూట్ మ్యాప్ ప్రకటించాలని, సీపీఎల్ రద్దు చేయాలని, 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తి అయిన వారికి పాత పెన్షన్ అమలు చేయాలని, హెల్త్కార్డుల మెడికల్ బిల్లుల సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ముత్యాలరెడ్డి, గౌరవాధ్యక్షులు రామచంద్రయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవరాల నిర్మల, జిల్లా కార్యదర్శులు పద్మజ, సురేష్, రాష్ట్ర కౌన్సిలర్ నాగరాజు, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ మోహన్, డివిజనల్ కోఆర్డినేటర్ మురళి, కృష్ణంరాజు, నేతలు ఖాదర్ బాషా, హేమాద్రి బాబు, ప్రభుకుమార్, వరలక్ష్మి, మురళి, గోపాల్ పాల్గొన్నారు.


