లారీ ఢీకొని విద్యార్థి మృతి
తడ: జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామాపురం ఎస్సీ కాలనీకి చెందిన విద్యార్థి సెల్వం అలియాస్ లారెన్స్ (16) మృతి చెందగా మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ కొండపనాయుడు కథనం మేరకు.. తమిళనాడు పరిధిలోని ఆరంబాకం పాఠశాలలో ప్లస్వన్ చదువుతున్న రామాపురం ఎస్సీ కాలనీకి చెందిన విద్యార్థులు కిషోర్, ఆరుస్వామి రోజులానే పాఠశాలకు వెళ్లి సాయంత్రం ద్విచక్ర వాహనంపై తిరుగు పయనం అయ్యారు. వీరితోపాటు రామాపురం ఉన్నత పాఠశాలలో గత ఏడాది పదో తరగతి చదివి ఫెయిల్ అయిన సెల్వం ట్యూషన్కి వెళ్లి వీరితోపాటు బైక్పై కూర్చున్నాడు. జాతీయరహదారిపై ఆరంబాకం నుంచి తమిళనాడుకు వెళుతున్న మినీ లారీ వేగం వచ్చి ద్విచక్ర వాహనం వెనుక ఢీకొంది. ప్రమాదంలో సెల్వం అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు చైన్నె స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


