మఠం భూముల్లో ఆక్రమణలపై సీఎంకు లేఖ
తిరుపతి రూరల్: గాంధీపురం పంచాయతీలోని మఠం భూముల్లో జరిగే భూ ఆక్రమణలను అరికట్టాలని, భూ ఆక్రమణ దారుడు రామసుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఎం చంద్రబాబుకు సీపీఎం నేతలు లేఖలు రాశారు. సోమవారం సీపీఎం కార్యాలయం వద్ద ఆ పార్టీ నేతలు ముఖ్యమంత్రికి రాసిన లేఖలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీపీఎం నేత జయచంద్ర మాట్లాడుతూ పేదల భూమిని ఆక్రమించిన రామసుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలని, మఠం భూములను కాపాడాలని కోరారు. తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వేనంబర్ 13లో 1.09 ఎకరాల భూమిని 32 మంది రజకులు 2014లో కొనుగోలు చేశారని, ఆ భూమిని రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి ఆక్రమించి దౌర్జన్యంగా ప్రహరీ నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు. అడ్డుకునేందుకు వెళ్లిన పేదలపై రౌడీలతో పేదలపై దాడి చేయిస్తున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం కార్యాలయం స్పందించి ఆ భూమిని కాపాడాలని, పేదలకు న్యాయం చేయాలని కోరుతూ లేఖలు రాసినట్టు తెలిపారు. లేఖల ప్రదర్శన కార్యక్రమంలో మహేష్, రమేష్, ఏలుమలై, పుష్ప, శంకర, చంద్ర, చంద్రారెడ్డి సతీష్, నరసింహ, శేఖర్, కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు.


