దేవరాపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఘోరంగా పతనం
30 కిలోల క్రేటు టమాటా రూ.30–రూ.50
కనీసం రవాణా ఖర్చులు రాని వైనం
పంటను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపిన రైతులు
కనీస గిట్టుబాటు ధర లేదని రైతులు ఆవేదన
దేవరాపల్లి : దేవరాపల్లి హోల్సేల్ కాయగూరల మార్కెట్లో మంగళవారం టమాటా ధరలు ఘోరంగా పతనమయ్యాయి. 30 కేజీల క్రేటు టమాటా కేవలం రూ. 30 నుంచి రూ. 50 మాత్రమే ధర పలకడంతో గత్యంతరం లేని స్థితిలో కొందరు రైతులు వ్యాపారులకు విక్రయించారు. మరికొందరు కనీసం రవాణా ఛార్జీలు సైతం రావడం లేదని మనస్థాపంతో కష్టపడి పండించిన టమాటాలను రోడ్డుపై పారపోసి నిరసన వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి కుటుంబమంతా ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో చివరకు తమకు కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాయగూర మార్కెట్ ఉండడంతో విస్తారంగా టమాటాను సాగు చేశామని, దిగుబడి సైతం ఆశాజనంగా ఉండడంతో ఎంతో ఆశపడ్డామన్నారు. తీరా పంట చేతికి అందే సమయంలో కేజీ టమాటాకు మరీ దారుణంగా రూపాయి, రూపాయిన్నర ధర పలకడంతో తాము ఎలా బతకాలని పలువురు రైతులు వాపోయారు.


