బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన
ఉపమాకలో జరగనున్న వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణోత్సవాలకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా బుధవారం పరిశీలించారు. డీఎస్పీ, సీఐలతో కలసి ఆయన ఉపమాకలో పర్యటించారు. స్వామివారి కల్యాణానికి లక్షలాది మంది తరలిరానున్న నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విలువైన స్వర్ణాభరణాలను అలంకరించి స్వామివారి రథోత్సవం, తిరువీధి సేవలు, ఎదురు సన్నాహా మహోత్సం నిర్వహించనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించాలని సూచించారు. వచ్చేనెల 3న రాజయ్యపేట సముద్ర తీరంలో స్వామివారి చక్ర స్నానం సమయంలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. డ్రోన్, సీసీ కెమెరాలు, మఫ్టీలో పోలీసు సిబ్బందితో నిరంతరం నిఘా పెట్టాలన్నారు. ఆశ్లీల నృత్యాల ప్రదర్శనకు తావులేదని, సంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలకే అనుమతి ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ దేవ ప్రసాద్, ఎస్పీ డీఎస్పీ జి.ఆర్.ఆర్.మోహన్, డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ బాల సూర్యారావు, సీఐ మురళి, ఎస్ఐ సన్నిబాబు, తదితరులు పాల్గొన్నారు.


