అనకాపల్లి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ సంపదను, వనరులను కార్పొరేట్ల పరం చేస్తే అభివృద్ధి ఎలా సాధ్యపడుతుందని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ అజశర్మ, అన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో బుధవారం బొప్పే ఉమామహేశ్వరరావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సంపదను కొల్లగొట్టి కార్పొరేట్లకు కట్టపెట్టేందుకు కేంద్రం, మరింత జోరుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నాయన్నారు. దీనికి వ్యతిరేకంగా మేధావులు, అభివృద్ధి కాముకులు, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజల నుంచి ప్రతిఘటన వ్యక్తం కావడం గమనార్హం అన్నారు. ఉత్తరాంధ్రలో జరుగుతున్న పరిణామాలను అర్ధం చేసుకుని ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు, సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రభుత్వాలు వైఖరిని నిలువరించే చర్యలు జరగాలన్నారు. అభివృద్ధి అంటే స్థానిక ప్రజలకు జీవన ప్రమాణాలు పెరిగేలా మంచి ఉపాధి, విద్య, వైద్య అవకాశాలు కల్పించడం అన్నారు. దురదృష్టవశాత్తూ ఉత్తరాంధ్రలో నేడు ప్రభుత్వాలు చేస్తున్న నిర్ణయాలు అభివృద్ధికి భిన్నంగా ఉన్నాయన్నారు. పరిశ్రమలు, వివిధ ప్రాజెక్టుల పేరుతో పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టడం, గిరిజన ప్రాంతాలతో పాటు విశాఖ నగర నడిబొడ్డున అత్యంత విలువైన 13.74 ఎకరాల ప్రభుత్వ భూమిని లులు మాల్కు కేటాయించడం చూస్తేనే ప్రభుత్వ అభివృద్ధి నమూనా ఎలాంటిదో అర్థమవుతుందన్నారు. 1/70 పీసా వంటి గిరిజన చట్టాలను ధిక్కరిస్తూ పాడేరు, పార్వతీపురం జిల్లాల్లో హైడ్రో పవర్ టూరిజం ప్రాజెక్టులకు భూములు లాక్కోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బాౖక్సైట్ తవ్వకాలకు చాపకింద నీరులా పావులు కదుపుతున్నారని, నక్కపల్లిలో బల్క్ డ్రగ్, మిట్టల్ స్టీల్, విజయనగరం జిల్లాలోఐటీ పార్కు, విశాఖలో గూగుల్ డేటా, టీసీఎస్, శ్రీకాకుళంలో కార్గో ఎయిర్పోర్ట్ వంటి సంస్థలకు 99 పైసలకే భూమిని ధారాదత్తం చేయడం ఏమి అభివృద్ధి అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ 50 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించి ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోను, మెట్రో రైల్, గిరిజన యూనివర్శిటీ నిర్మాణాలను తక్షణమే పూర్తి చేయాలన్నారు. విద్యాసంస్థల్లో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని నియమించి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం కల్పించాలని, పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో కిడ్నీ వ్యాధి కారణాలను తెలుసుకునే సమగ్ర పరిశోధన చేయాలన్నారు. మాకవరపాలెం మెడికల్ కళాశాలను ప్రభుత్వం తక్షణమే నిర్మించాలన్నారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కర్రి అప్పారావు, జేవీబీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు త్రిమూర్తులురెడ్డి, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు, ఎల్ఐసీ విశ్రాంత ఉద్యోగులు రంగబాబు, జె.రమేష్, విశ్రాంతి అధ్యపకుడు ఇమ్మిడిశెట్టి చక్రపాణి, న్యాయవాది గంటా సురేష్ పాల్గొన్నారు.


