9 నుంచి రిలే నిరాహార దీక్షలు
అనకాపల్లి: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రభుత్వ మహిళా వసతి గృహాలను ఏర్పాటు చేయాలని వచ్చే నెల 9 నుంచి 14వ తేదీ వరకూ విద్యార్థులతో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జి.ఫణింద్రకుమార్ తెలిపారు. బుధవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో దీక్షల గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో మహిళా హాస్టళ్ల ఏర్పాటుపై పలుమార్లు జిల్లా అధికారులకు స్థానిక ప్రజా ప్రతినిధికి విన్నవించుకున్నా ఎటువంటి స్పందన లేదన్నారు. జిల్లా కేంద్రంలో ఒకే బీసీ మహిళ వసతి గృహం ఉందని, అందులో 200 మంది విద్యార్థినులు అరకొర వసతుల మధ్య ఇబ్బందులు పడుతున్నట్టు వాపోయారు. దాంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులు విద్యకు దూరమవుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు జగదీష్, సింహాద్రి, మణికంఠ, రూపవతి, లిఖిత, తేజ, సుశీల, మధు తదితరులు పాల్గొన్నారు.


