అంగన్వాడీల రిలే నిరహార దీక్ష
నర్సీపట్నం: అంగన్వాడీల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు ఎం.దుర్గామణి డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం మహాత్మాగాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ కనీసం వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. గ్రాట్యూటీ అమలుకు నిబంధనలు రూపొందించాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలన్నారు. సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడ్లైన్స్ ఇవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. మే నెల అంతా వేసవి సెలవుల జీవో వెంటనే ఇవ్వాలన్నారు. లబ్ధిదారులకు బియ్యం, ఆయిల్, కందిపప్పు క్వాంటీటి పెంచాలన్నారు. మెనూ చార్జీలు పెంచి, గ్యాస్ ఉచితంగా సరఫరా చేయాలన్నారు. ప్రీ స్కూళ్లను బలోపేతం చేయాలన్నారు. ప్రీ స్కూల్ పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం వర్తింపజేయాలన్నారు. ప్రాజెక్టు అధ్యక్షురాలు ఆర్.రమణమ్మ, కార్యదర్శులు డి.మహాలక్ష్మి, సీనియర్ నాయకులు వి.సామ్రాజ్యం, వరలక్ష్మి, వెంకటలక్ష్మి, భాగ్య, ఆశాజ్యోతి, శోభ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు పాల్గొన్నారు.


