జీడి పంటకు మద్దతు ధర ప్రకటించాలి
గిరిజన రైతుల ఆందోళన
రావికమతం: జీడి పంటకు మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ మండలంలోని చీమలపాడు పంచాయతీలో ఏిపీ ఆదివాసీ గిరిజన సంఘం, ఐదో షెడ్యూల్ సాధన కమిటీ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గిరిజన రైతులు బుధవారం కల్యాణపులోవలో ఆందోళన చేపట్టారు. జీడి పిక్కలకు ప్రభుత్వం మద్దతు ధర కేజీ రూ.200 ఇవ్వాలని, రైతు సేవా కేంద్రాల ద్వారా జీడి పిక్కలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, సాగు రాయితీలు పునరుద్ధరించాలని, జీడితోటలో అంతర కృషి పరికరాలు ఉచితంగా అందించాలని కోరారు. జీడి పరిశోధన కేంద్రాలు ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసి నాణ్యమైన మొక్కలు సరఫరా చేయాలన్నారు. బ్యాంక్ రుణాలు అందించాలని, జీడి పంటకు వాతావరణ బీమా అమలు చేయాలని, మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సీపీఎం కార్యవర్గ సభ్యులు కే గోవిందరావు, గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గెమ్మిల వాసు తదితరులు పాల్గొన్నారు.


