నందం.. త్మీయత.. వేదన
ఐదేళ్ల సుదీర్ఘ ప్రయాణం.. వార్డు ప్రజలతో పెనవేసుకున్న అనుబంధం.. నగర అభివృద్ధిలో పంచుకున్న భాగస్వామ్యం.. ఇవన్నీ ఒకెత్తయితే, మరో పక్షం రోజుల్లో పదవి నుంచి దిగిపోతున్నామన్న భావన వారి మనసులను బరువెక్కించింది. ఇంకొన్ని పనులు మిగిలిపోయాయే.. ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చలేకపోయామే అన్న ఆవేదన వారి మాటల్లో కనిపించింది. గౌరవప్రదంగా వీడ్కోలు పలికేలా కనీసం ఆరంభ దశలో ఉన్న పనులైనా పూర్తి చేయండంటూ అధికారులను వారంతా అభ్యర్థించారు. ఆనందం, ఉద్వేగం, నిరాశ.. ఇలా కలగలిపిన భావోద్వేగాల మధ్య జీవీఎంసీ ప్రస్తుత పాలకవర్గ చిట్టచివరి సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. – డాబాగార్డెన్స్ (విశాఖ)
చివరి సమావేశం కావడంతో కౌన్సిల్ హాల్లో క్రమశిక్షణ కంటే ఆత్మీయ పలకరింపులకే ఎక్కువ ప్రాధాన్యం దక్కింది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశానికి మేయర్ పీలా శ్రీనివాసరావు కాస్త ఆలస్యంగా రావడంతో 11.30 గంటలకు సభ మొదలైంది. ఈలోపు సభ్యులంతా పిచ్చాపాటి కబుర్లు, సెల్ఫీలతో సందడి చేశారు. సభకు హాజరైన ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సైతం సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ ఫొటోలు దిగారు.
సుదీర్ఘంగా జీరో అవర్..
సమావేశం ప్రారంభమైన వెంటనే మేయర్ జీరో అవర్ను ప్రకటించారు. సభ్యులకు తమ వార్డుల సమస్యలు చెప్పుకునేందుకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దీంతో ఉదయం 11.30కి మొదలైన జీరో అవర్ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన అజెండా చర్చ రాత్రి 8 గంటల వరకు సాగింది. ఈ సమావేశంలో మొత్తం 37 అజెండా అంశాలతో పాటు మరో 30 టేబుల్ అంశాలకు కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది.
ఆటలొద్దు.. టూర్కే వెళ్దాం
చివరి కౌన్సిల్లో మహిళా కార్పొరేటర్లు పార్టీలకతీతంగా ఏకమయ్యారు. ఐదేళ్లుగా సభలో ప్రజాసమస్యలపై గొంతెత్తిన వీరంతా ఆఖరి రోజున చిరునవ్వులు చిందిస్తూ ఆప్యాయతలు పంచుకున్నారు. ముగింపు సందర్భంగా మూడు రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహిద్దామన్న మేయర్ ప్రతిపాదనను వారు తిరస్కరించారు. తమకు ఆటలు వద్దని, అందరినీ టూర్కు తీసుకెళ్లాలని పట్టుబడుతూ మేయర్ పోడియంను చుట్టుముట్టారు. జీరో అవర్ జరుగుతున్నా.. వినకుండా కమిషనర్ కేతన్గార్గ్కు వినతిపత్రం అందజేశారు.
ఉన్నత చదువులు చదివిన అధికారుల ముందు, పెద్దల ముందు కూర్చుని మాట్లాడే స్థాయికి తాము చేరడానికి తమ భర్తల 0సహకారం మరువలేనిదని బీజేపీ కార్పొరేటర్ గంకల కవిత గుర్తు చేయగా.. మిగిలిన మహిళా సభ్యులంతా ఏకగ్రీవంగా మద్దతు పలుకుతూ తమ భర్తలకు, ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
నందం.. త్మీయత.. వేదన


