● బైలపూడి, ఎ.అగ్రహారం గ్రామాల రైతులు
తహసీల్దార్కు వినతి పత్రం అందించి
మాట్లాడుతున్న రైతులు
చీడికాడ: పూర్వం నుంచి సాగులో ఉన్న భూములను సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుకు ఇవ్వబోమని మండలంలోని బైలపూడి, ఎ. అగ్రహారం చిన్న, సన్నకారు రైతులు స్పష్టం చేశారు. సోమవారం పీజీఆర్ఎస్లో తహసీల్దార్ కిషోర్ లింకన్కు వినతి పత్రం అందించారు. బైలపూడికి చెందిన జి.రమేష్, అగ్రహారానికి చెందిన సలాది గంగశేషులుతోపాటు 50 మంది రైతులు మాట్లాడుతూ తమ సాగులో ఉన్న భూములకు ప్రభుత్వం డీ పట్టాలు అందించిందన్నారు. ఆ భూముల్లో వేరుశనగ, అపరాలు, కందులు, పామాయిల్ పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఆ భూములను సోలార్ ప్లాంట్కు అందిస్తే జీవనోపాధి దెబ్బతింటుందన్నారు. ప్లాంట్ వల్ల విడుదలయ్యే రేడియేషన్తో తమ గ్రామాల్లో ప్రజలు, చిన్నపిల్లలకు, పశువులకు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా తమ భూములను ఇచ్చేది లేదన్నారు.


