కె.కోటపాడు : మండలంలో పాతవలస గ్రామానికి చెందిన తవినేని దేముడుబాబు(40) ఆదివారం రాత్రి కె.సంతపాలెం వద్ద రైవాడ కాలువలో ప్రమాదవశాత్తూ పడి మృతి చెందాడు. దేముడుబాబు భార్య బంగారమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఫిర్యాదు మేరకు కె.కోటపాడు ఎస్ఐ ఆర్.ధనుంజయ్ తెలిపిన వివరాలివి. పాతవలస గ్రామానికి చెందిన తవినేని దేముడుబాబుతో పాటు ఆయన మేనల్లుడు కిల్లి వెంకటరావు కె.సంతపాలెం రైవాడ కాలువకు సమీపంలో కాల కృత్యాలను తీర్చుకునేందుకు ఆదివారం వెళ్లారు. కాలువకు కొంత దూరంలో మేనల్లుడు వెంకటరావు ఉండిపోగా, కాలకృత్యాలకని వెళ్లిన దేముడుబాబు సమయం గడుస్తున్నా రాకపోవడంతో వెంకటరావు అతని ఆచూకీ కోసం వెతికాడు. కాలువ వెంబడి వెతగ్గా కొంత దూరంలో కాలువలో దేముడుబాబును గుర్తించి బయటకు తీశాడు. అప్పటికే దేముడుబాబు మృతిచెంది ఉన్నాడు. మృతుడికి భార్య, కుమారుడితో పాటు అనారోగ్యంతో ఉన్న తల్లి ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న దేముడుబాబు మృతితో కుటుంబ సభ్యులతో రోధన స్థానికులను కంటతడి పెట్టించింది. దేముడుబాబు మృతదేహానికి పోస్టుమార్టం పనులను పూర్తి చేసి సోమవారం కుటుంబ సభ్యులకు అందించారు.


