స్కూల్ బస్సుకు ప్రమాదం
మాడుగుల రూరల్ : చోడవరం చలపతి పాఠశాలకు చెందిన బస్సు బుధవారం సాయంత్రం మాడుగుల మండలం ఎం.కోటపాడు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులు స్వల్ప గాయాలతో బయట పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, రోడ్డు వెడల్పుగా ఉండడంతో పాటు ఎటువంటి ట్రాఫిక్ లేకపోయినా రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలపై ఎక్కించడంతో బస్సు కాలువలోకి దూసుకుపోయిందని విద్యార్థులతో పాటు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై ఎస్ఐ నారాయణరావును వివరణ కోరగా.. డ్రైవర్ మామిడి చిన్న మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


