బుచ్చెయ్యపేట : ప్రసిద్ధి చెందిన వడ్డాది వేంకటేశ్వరస్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. వడ్డాది వెంకన్న ఉత్సవాలపై భక్తుల విమర్శలు కల్యాణ వేడుకల ఏర్పాట్లలో వైఫల్యాలపై సోమవారం సాక్షి కథనానికి అధికారులు స్పందించారు. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి వేంకటేశ్వరస్వామి 153వ కల్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా సాధారణ అలంకరణతోనే స్వామివారి దర్శనాలు కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై దేవస్ధానం అధికారులు సోమవారం శ్రీదేవి,భూదేవి,స్వామి వారి విగ్రహాలను పుష్ఫాలతో ప్రత్యేకంగా అలంకరించారు. గిరిజాంబ కొండపైన ఉన్న స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి దర్శనాలు కల్పించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. కల్యాణ వేడుకల్లో భాగంగా ప్రత్యేకమైన స్వామి వారి నాగవల్లి వసంతోత్సవం, తిరువీధి ఉత్సవం,చక్రస్నానం మంగళవారం జరగనుంది. ఆలయ ధర్మకర్త దొండా కన్నబాబు, ఈవో శర్మ, దేవాదాయశాఖ సిబ్బంది నాగవల్లి వసంతోత్సవం ఏర్పాట్లపై ఆలయంలో చర్చించారు. చంద్రగ్రహణం తగలక ముందే స్వామి వారి నాగవల్లి వసంతోత్సవం పూర్తి చేయాలని నిర్ణయించారు.


