పౌష్టికాహారం పంపిణీలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
దేవరాపల్లి : అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సరఫరా చేసే పౌష్టికాహార పంపిణీలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్. సూర్యలక్ష్మి అన్నారు. మండలంలోని శంభువానిపాలెం, వాలాబు, రైవాడ అంగన్వాడీ కేంద్రాలను మంగళవారం ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రీ స్కూల్ పనితీరు, పిల్లల హాజరు పట్టికను, పలు రిజిష్టర్లను పరిశీలించారు. ప్రీ స్కూల్ పిల్లలతో మాట్లాడి విద్యా బోధనపై ఆరాతీశారు. పోషణ్ ట్రాకర్, బాల సంజీవని యాప్ అప్డేషన్ను ఆమె స్వయంగా పర్యవేక్షించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహార, ఇతర సేవలను చిన్నారుల తల్లిదండ్రులు, గర్భిణులు, బాలింతలకు ఆమె వివరించారు. ఈ సందర్భంగా పీడీ సూర్యలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో కచ్చితంగా సమయ పాలన పాటించి, పారదర్శకంగా వ్యవహరించాలని అంగన్వాడీ కార్యకర్తలకు ఆదేశించారు. అనంతరం వాలాబు గ్రామంలో స్థానిక ప్రజలతో సమావేశమై బాల్య వివాహాలతో కలిగే అనర్దాలను వివరించి, వారితో ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహాలను నిరోధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కె.కోటపాడు ప్రాజెక్ట్ ఐసీడీఎస్ సీడీపీవో పి.లలితకుమారి, సూపర్వైజర్లు రాములమ్మ, ఆదిలక్ష్మి, వాలాబు సర్పంచ్ పోడెల వెంకటలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
పౌష్టికాహారం పంపిణీలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు


