సాక్షి, అనకాపల్లి : దళితుల ఓట్లతో గద్దెనెక్కి అదే దళితుల భూములను బెదిరించి లాక్కొంటామంటే మా తడాఖా చూపిస్తామంటూ మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్రావు హెచ్చరించారు. పంచదార్ల గ్రామంలో దళితుల భూముల్లోకి పొలిటికల్ బ్రోకర్లు, అధికారులు ఎవరైనా వచ్చి బెదిరిస్తే రాష్ట్రంలో ఉన్న దళిత సంఘాలన్నీ ఏకమై కూటమి ప్రభుత్వానికి, అధికారులకు తగిన బుద్ధి చెబుతామన్నారు. సోమవారం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్లలో దీక్ష చేపడుతున్న దళితులకు మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్రావు మద్దతు తెలిపారు. కూటమి ప్రభుత్వం తీరుపై నిరసనగా నెల రోజులుగా చేపడుతున్న దీక్షా శిబిరం వద్దకు వెళ్లి వారికి ధైర్యాన్ని నింపారు. వారి పోరాటాన్ని మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో జిల్లా మెజిస్ట్రేట్గా ఉన్న కలెక్టర్ నుంచి తహసీల్దార్ వరకూ అందరూ దళితుల భూములను లాక్కోవడంలో పాపం పంచుకున్నారని, వీరిని వెనకుండి నడిపించేది స్థానిక జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్, కూటమి నేతలు అని అన్నారు. పంచదార్ల గ్రామంలో ఉన్న ఈ దళితులు సాగు చేసుకునే భూములను లాక్కొనేందుకు వారికి తెలియకుండానే నకిలీ నోటీసులు పంపించి వారి భూములను కొట్టేసేందుకు కూటమి ప్రజాప్రతినిధులతో కలిసి కుట్రకు తెరలేపారన్నారు. పంచదార్లలో దళితులకు న్యాయం చేయడానికి వైఎస్సార్సీపీ లీగల్ సెల్తో చర్చించి న్యాయ సహాయం అందజేస్తామన్నారు. 50 ఏళ్ల క్రితం పేద దళితలకు ఇచ్చిన భూములను కూటమి ప్రభుత్వం లాక్కోవాలని చూస్తే పార్టీలకతీతంగా ప్రజాసంఘాలు, దళిత సంఘాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎసీ సెల్ అధ్యక్షుడు పాలిసెట్టి సురేష్రాజ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి దండు జ్ఞానదీప్, మాల మహానాడు రాష్ట్ర నాయకుడు సింహాద్రి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు సుజాత, శిరీష శ్రీనుబాబు, జెడ్పీటీసీ ధూళి నాగరాజు, దివ్యాంగుల విభాగ యలమంచిలి నియోజకవర్గ అధ్యక్షుడు రేబాక రాము, ఉప్పులూరి నాయుడు, కిశోర్ రాజు, బుడబండి అప్పారావు, గూటాల నాగ అప్పలరాజు,ఽ ధారపాటి అబ్దం, బుడబండి రమేష్, చరపల్లి లోవరాజు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నేత ఐడీ బాబు, సురేష్ పాల్గొన్నారు.


