ముంచంగిపుట్టు: వివాహేతర సంబంధం ఓ గిరిజనుడి ప్రాణాలను బలిగొంది. మండల కేంద్రం ముంచంగిపుట్టులో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గొంతుకోయడంతో ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. దీనికి సంబంధించి జి.మాడుగుల సీఐ బి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి:
అసలేం జరిగింది?
పెదబయలు మండలం, అడుగులపుట్టు పంచాయతీ, కొత్తపుట్టు గ్రామానికి చెందిన కాసులమ్మకు, గూడెంకొత్తవీధి మండలం ఆర్వీనగర్కు చెందిన కిముడు అరుణ్తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరు గత ఆరేళ్లుగా పెదబయలు మండల కేంద్రంలో నివాసం ఉంటున్నారు. అరుణ్ జీపు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, ఏడాది క్రితం పెదబయలు మండలం అరడకోట పంచాయతీకి చెందిన కూర్తాడి నాగేశ్వరరావు (27)తో కాసులమ్మకు పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయమై అరుణ్కు, కాసులమ్మకు మధ్య తరచూ గొడవలు జరిగేవి. నాగేశ్వరరావును అరుణ్ పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా, కాసులమ్మ భర్తతో గొడవపడి నాగేశ్వరరావు వద్దే ఉంటోంది.
పథకం ప్రకారమే..
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త అరుణ్, తన భార్య అన్నయ్య అయిన వంతాల నాగేశ్వరరావుతో కలిసి ఈ సమస్యపై చర్చించాడు. సోమవారం రాత్రి ముంచంగిపుట్టు మండలం ఏనుగురాయి పంచాయతీ కొండపడ హోళీ జాతరకు వీరిద్దరూ వచ్చారు. ఆ సమయంలో కాసులమ్మ, నాగేశ్వరరావుతో కలిసి ముంచంగిపుట్టు మండల కేంద్రంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ముంచంగిపుట్టు రామాలయం సమీపంలోని వారి ఇంటికి వెళ్లిన అరుణ్, వంతాల నాగేశ్వరరావు.. తలుపు తీయమని కోరారు. తలుపు తీయగానే లోపల ఉన్న కూర్తాడి నాగేశ్వరరావుపై కత్తితో దాడి చేసి, పీక కోసి అక్కడి నుంచి పరారయ్యారు.
పోలీసుల చర్యలు
కాసులమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికి నాగేశ్వరరావు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆస్పత్రికి తరలించే లోపే అతను మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్థానిక సీహెచ్సీకి తరలించారు.
జి.మాడుగుల సీఐ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్య చేసి పరారీలో ఉన్న అరుణ్, వంతాల నాగేశ్వరరావులను 12 గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్టు చేశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని సీఐ తెలిపారు.
వివాహేతర సంబంధమే కారణం
వెల్లడించిన సీఐ శ్రీనివాసరావు
ముంచంగిపుట్టులో ఘటన
ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన
పోలీసులు


