ఉపమాక చేరిన వెంకన్న ఆభరణాలు
విశాఖ నుంచి తెచ్చిన స్వామివారి ఆభరణాలు
నక్కపల్లి : ఉపమాక వేంకటేశ్వర స్వామివారికి చెందిన ఆభరణాలు మంగళవారం ఆలయానికి తీసుకు వచ్చారు. స్వామివారికి కోట్లాది రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. వీటిలో పచ్చల హారం, కెంపులు, మరకత మాణిక్యాలు, వజ్ర వైఢూర్యాలు, రత్నాలు పొదిగిన హారం ఉన్నాయి. వీటిని భద్రతా కారణాల రీత్యా విశాఖలోని సబ్ట్రెజరీలో భద్రపరిచారు. ప్రతిఏటా వీటిని స్వామివారి కల్యాణోత్సవాల సందర్భంగా పటిష్ట్ట బందోబస్తు మధ్య తీసుకువచ్చి స్వామివారికి అలంకరిస్తారు. దేవస్థానం సూపరింటెండెంట్ కూర్మేశ్వరరావు, సీఐ మురళి, ఎస్ఐ సన్నిబాబు ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్లతో కూడిన బృందం పటిష్ట బందోబస్తు మధ్య ఆభరణాలు తీసుకు వచ్చారు. స్వామివారికి అలంకరించి భక్తుల దర్శనం కోసం ఐదురోజుల పాటు స్వామివారి ఆభరణాలను ఇక్కడే ఉంచుతారు. ఆభరణాలు ఆలయానికి తీసుకు వచ్చిన నేపథ్యంలో సివిల్ పోలీసులతో పాటు, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు బలగాలు ఆభరణాలు భద్రపరచిన ప్రాంతంలో పహరా కాస్తున్నాయి. విశాఖ నుంచి తీసుకు వచ్చిన ఆభరణాలను బేడా మండపం చుట్టూ ప్రదక్షణలు నిర్వహించి లాకర్లో భద్రపరిచారు.


