విత్తనం ద్వారా అరటిసాగు
దేవరాపల్లి : మండలంలోని తామరబ్బ పంచాయతీ శివారు పల్లపు కోడాబులో సనపల జగదీష్, ఇందుకూరి విష్ణుప్రియ దంపతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు. విశాఖపట్నంకు చెందిన జగదీష్ ఎమ్మెస్సీ ఎన్విరాన్మెంట్ సైన్స్, విష్ణుప్రియ ఎన్విరాన్మెంట్ సైన్స్లో డాక్టరేట్ సైతం పూర్తి చేశారు. వ్యవసాయంపై ఉన్న మక్కువతో దంపతులిద్దరూ ఆకుకూరలు, కాయగూరలతో పాటు దేశీయ పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వీరు సాగు చేస్తున్న పంటలను విశాఖపట్నం నుంచి వచ్చిన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, మ్యాంగో మేన్ అప్పాజీ, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జె.వి. రత్నం, ఇంజినీర్ అల్లు గోపి, గోశాల ప్రతినిధి అచ్యుతరావు తదితరులతో కూడిన బృందం మంగళవారం సందర్శించారు. మొలకలతో కాకుండా విత్తనం ద్వారా పెంచిన అరటి చెట్టును, వాటికి కాసిన భారీ అరటి గెలలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రసాయనాలను వినియోగించకుండా కాయగూరలు, ఆకు కూరలు, పండ్ల తోటలు తదితర సుమారు 150 రకాల పంటలు పండించి, మంచి దిగుబడులు సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.


