నైతిక విలువలు పెంపొందేలా విద్యాభ్యాసం
మురళీనగర్(విశాఖ ఉత్తర): విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించుకునేలా విద్యాభ్యాసం జరగాలని అనకాపల్లి జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ కె.ఇందిరాభారతి అన్నారు. విశాఖలోని కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఫార్మసీ విద్యార్థుల ఫ్రెషర్స్ డే, వీడ్కోలు సమావేశం ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటరమణ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫార్మసీ విభాగం వైద్య రంగంలో కీలకంగా వ్యవహరిస్తోందన్నారు. వెంకటరమణ మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థులు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకునే విధంగా ప్రయోగాత్మక అధ్యయనంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి, ఫార్మసీ కాలేజీ పూర్వ విద్యార్థి ఇందిరాభారతిని ఘనంగా సత్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఫార్మసీ విభాగాధిపతి జె.గోవిందరావు, జనరల్ సెక్షన్ హెడ్ డాక్టర్ పీఎం బాషా, ఎలక్ట్రికల్ విభాగం హెడ్ డాక్టర్ ఎం.నారాయణ, విద్యార్థి సలహాదారు ఎస్.వి.రమణ పాల్గొన్నారు.


