ఉపాధ్యాయ సమస్యలపై ఏపీటీఎఫ్ ధర్నా
చోడవరంలో ధర్నా చేస్తున్న ఏపీటీఎఫ్ ఉపాధ్యాయులు
చోడవరం: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేశారు. చోడవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద మెయిన్రోడ్డు పక్కన ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి చోడవరం తాలూకా పరిధిలో ఉన్న చోడవరం, బుచ్చెయ్యపేట, చీడికాడ, మాడుగుల, రావికమతం, కె.కోటపాడు మండలాలకు చెందిన ఏపీటీఎఫ్ సంఘం ఉపాధ్యాయులంతా ఈ ధర్నాలో పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, 12వ పీఆర్సీ వెంటనే అమలు చేయాలని, పీఆర్సీ కమిషన్ను నియమించే వరకూ 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని, ఐఆర్ ప్రకటించాలని, రావలసిన అన్ని రకాల బకాయిలు వెంటనే చెల్లించాలని, ఈహెచ్ఎస్ పరిమితిని రూ. 25లక్షలకు పెంచాలని, బోధనేతర పనులు చెప్పే విధానాలను రద్దు చేసి ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని వారు డిమాండ్ చేశారు. 2009 కి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకూ ఉపాధ్యాయులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చలేదని ఏపీటీఎఫ్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమరాన త్రినాఽథరావు అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికి దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షుడు మోసూరి మహాలక్ష్మినాయుడు, జిల్లా కార్యదర్శి ఎ. ప్రసాదరావు, రాష్ట్ర కౌన్సిల్ విజయలక్ష్మి, శ్యాంకుమార్, మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఆర్. చిరంజీవి, కె. మల్లేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడు గొల్లు శ్రీనువాసరావు పాల్గొన్నారు.


