అక్రమ గ్రావెల్ క్వారీపై విచారణ
అందలాపల్లి కొండపై విచారణ చేస్తున్న మైన్స్ అధికారులు
అచ్యుతాపురం రూరల్: మండలంలోని కొండకర్ల పంచాయతీ అందలాపల్లి గ్రామ సర్వే నంబరు 136/2లో అనధికార గ్రావెల్ క్వారీని గురువారం మైన్స్ అధికారులు తనిఖీ చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదు మేరకు అచ్యుతాపురం – అనకాపల్లి రోడ్డుకు అవసరమైన గ్రావెల్ తరలించేందుకు బీవీఎస్ఆర్ సంస్థ ఇక్కడ క్వారీని లీజుకు తీసుకుంది. ఇదే అవకాశం చేసుకుని సదరు సంస్థకు కేటాయించిన 4.2 హెక్టార్లకు మించి ఇష్టానుసారంగా మైనింగ్ చేస్తోంది. అక్రమంగా వివిధ నిర్మాణ సముదాయాలకు అమ్మకాలు చేస్తోంది. దీనికితోడు రాత్రిళ్లు భీకర శబ్దాలతో కొండను పేల్చడంతో గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఈ వ్యవహారంపై కొండకర్ల పంచాయతీకి చెందిన గ్రామ పెద్ద కోట్ని అప్పల శివ నూకరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైన్స్ అధికారులు విచారణ చేపట్టి నివేదిక తీసుకున్నారు.


