
బేగా (ఆస్ట్రేలియా): ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) చాలెంజర్ టూర్ ఈవెంట్లో భారత ప్లేయర్ అనాహత్ సింగ్ ఫైనల్కు దూసుకెళ్లింది. న్యూ సౌత్వేల్స్ స్క్వాష్ బేగా ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో శనివారం 17 ఏళ్ల అనాహత్ సింగ్ 3–2 (10–12, 11–5, 11–5, 10–12, 11–7)తో నూర్ ఖఫాగీ (ఈజిప్ట్)పై విజయం సాధించింది. 54 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో టాప్సీడ్గా బరిలోకి దిగిన భారత ప్లేయర్ అదరగొట్టింది.
14 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న అనాహత్... అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శనతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు 18 పీఎస్ఏ టోర్నీల్లో పాల్గొన్న అనాహత్... అందులో 12 టైటిల్స్ గెలిచింది. మరో సెమీఫైనల్లో భారత ప్లేయర్ ఆకాంక్ష సాలుంఖే 1–3 (9–11, 11–7, 10–12, 6–11)తో హబీబా హనీ (ఈజిప్ట్) చేతిలో ఓడింది.
42 నిమిషాల పాటు సాగిన పోరులో ఆకాంక్ష చక్కటి పోరాట పటిమ కనబర్చినా... కీలక సమయంలో పాయింట్లు కోల్పోయి పరాజయం వైపు నిలిచింది. ఫైనల్లో హబీబా హనీతో అనాహత్ తలపడనుంది. పీఎస్ఏ స్క్వాష్ టూర్ సీజన్లో ఇదే తొలి ప్రపంచ స్థాయి ఈవెంట్ కాగా... టైటిల్ సాధించడమే లక్ష్యంగా అనాహత్ బరిలోకి దిగనుంది.