‘కాళేశ్వరం’ పేల్చివేత కుట్ర వెనుక కాంగ్రెస్, బీజేపీ | RS Praveen Kumar Comments Over BJP and Congress Conspiracy On Kaleshwaram Project | Sakshi
Sakshi News home page

‘కాళేశ్వరం’ పేల్చివేత కుట్ర వెనుక కాంగ్రెస్, బీజేపీ

Aug 17 2025 4:35 AM | Updated on Aug 17 2025 4:35 AM

RS Praveen Kumar Comments Over BJP and Congress Conspiracy On Kaleshwaram Project

బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

మేడిగడ్డలో ఒక్క పిల్లర్‌ మాత్రమే ఎందుకు కుంగిపోయింది?

దీనిపై ‘సిట్‌’తో విచారణ జరపాలి

రేవంత్, బండి సంజయ్, కిషన్‌రెడ్డి పాత్రను తేల్చాలి

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చివేసేందుకు జరి గిన కుట్ర వెనుక కాంగ్రెస్, బీజేపీ హస్తం ఉందని బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమా ర్‌ ఆరోపించారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్ర పన్నాయన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2022లో రికార్డు స్థాయిలో గోదావరికి వరద వచ్చినా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు తట్టుకున్నాయ న్నారు. కానీ ఎవరో స్క్రిప్టు రాసినట్లుగా మేడిగడ్డలో ఒక్క పిల్లర్‌ మాత్రమే ఎందుకు కుంగిపోయిందని ప్రవీణ్‌ కుమార్‌ ప్రశ్నించారు. 

సిట్‌ ఏర్పాటు చేసి విచారణ జరపాలి
‘మేడిగడ్డ కుంగితే పిల్లర్లకు ఎక్కడా పగుళ్లు రావని ఇంజనీరింగ్‌ నిపుణులు చెపుతున్నారు. మేడిగడ్డలో 20వ నంబర్‌ పిల్లర్‌ను ఎవరో పేల్చే కుట్రచేశారు. కుట్ర వెనుక ఉన్న అసాంఘిక శక్తులు రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్, కిషన్‌ రెడ్డి.. ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది తేల్చాలి. ఘటన జరిగిన వెంటనే రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్, కిషన్‌ రెడ్డి మొబైల్‌ ఫోన్‌ డేటా చెక్‌ చేస్తే వెంటనే దొరికేవాళ్లు. దీని వెనుక రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఉన్నారా? లేదా? అనేది సిట్‌ ఏర్పాటు చేసి తేల్చాలి. లేదా అక్కడ తక్కువ స్థాయిలో ఏమైనా భూకంపాలు వచ్చాయా లేదా అనేది తేల్చాలి’ అని ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

కాగా, 2023 అక్టోబర్‌ 21న రాత్రి మేడిగడ్డ బరాజ్‌ వద్ద పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చినట్లు మరుసటి రోజు మహదేవ్‌పూర్‌ పోలీసు స్టేషన్‌లో ఇరిగేషన్‌ శాఖ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఫిర్యాదు చేశారని ప్రవీణ్‌కుమార్‌ గుర్తు చేశారు. అయితే పేలుళ్ల కోణంలో పోలీసులు విచారణ జరపకపోగా, ఇప్పటి వరకు ఎవరి వద్దా స్టేట్‌మెంట్లు రికార్డు చేయలేద న్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాసిన వెంటనే వచ్చిన ఎన్‌డీఎస్‌ఏ మేడిగడ్డ పేలుళ్లపై ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement