
సాక్షి, కర్నూలు: కర్నూలు(Kurnool) జిల్లాలో విషాదం నెలకొంది. హొళగుంద మండలం దేవరగట్టు(devaragattu) మాళ మల్లేశ్వరస్వామి బన్నీ(bunny festival) ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. బన్నీ ఉత్సవాల ప్రారంభంలోనే రెండు వర్గాలు కర్రలతో తలపడటంతో ఇద్దరు భక్తులు మృతి చెందారు. దాదాపు వంద మంది తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల ప్రకారం.. దేవరగట్టులో గురువారం అర్ధరాత్రి స్వామి, అమ్మవారి వివాహం అనంతరం ఊరేగింపు జరిగింది. దేవతామూర్తులను తీసుకెళ్లేందుకు రెండు వర్గాలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల వారు కర్రలతో దాడులు చేసుకోగా.. ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 100 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆదోని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు.. దేవరగట్టులో ఉత్సవాలు కొనసాగుతున్నాయి.
