అనారోగ్యం అంటే ఎవ్వరైనా హడలిపోతాం. ఎలా బయటపడతాం అనే బెంగ వచ్చేస్తుంది. దీనికి తోడు విధి పెట్టే భయంకరమైన పరీక్షలకు అల్లాడిపోతుంటాం. అలాంటి వాటన్నింటిని జయించి..ఎందరికో మార్గదర్శకురాలిగా మారారు మినాతి బోర్ఠాకూర్. కేన్సర్కి గట్టి కౌంటిరిచ్చేలా సాగుతున్నా ఆమె ప్రయాణం ఎందరో కేన్సర్ బాధితులకు స్ఫూర్తి కూడా.
అసోంలోని గువాహటికి చెందిన మినాతి బోర్ఠాకూర్కి చిన్న వయసులోనే పెళ్లి, ముగ్గురు పిల్లలు. అయితే ఆ ముగ్గురి పిల్లలు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. ఆ బాధ తట్టుకోవడం అంత సులభం కాలేదామెకు. దాన్నుంచి బయటపడేందుకు చదువుపై ధ్యాస పెట్టారామె. అలా చదువుకున్న కాటన్ కాలేజ్లోనే ప్రొఫెసర్గా చేసి ఫిలాసఫీ విభాగానికి హెడ్ స్థాయికి ఎదిగారు. ఈ క్రమంలో ఎన్నో రిసెర్చ్ పేపర్లు రాస్తుండేవారు.
అయితే ఒకరోజు ఉన్నటుండి కడుపునొప్పి రావడం మొదలైంది. మొదట్లో సాధరమైనదిగా కొట్టిపారేసింది. కానీ రాను రాను తీవ్రమై తట్టుకోలేని స్టేజ్కి వచ్చేశారు. దాంతో కుటుంబసభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తీసుకువెళ్లగా..కేన్సర్ అని తేలింది. అది కాలేయం, ఊపిరితిత్తులు, పాంక్రియాస్కి పాకింది. అసలు బతకడమే కష్టమన్నారు వైద్యులు. అయితే భర్త బిహారి బోర్ఠాకూర్ ఆమె చేత కేన్సర్ జయించిన వారి జీవితాల పుస్తకాలను చదివించేవారు.
వాళ్ల స్ఫూర్తితో పట్టుదలగా ట్రీట్మెంట్ తీసుకుని..కేన్సర్ని నుంచి బయటపడ్డారు. అయితే మినాతికి కేన్సర్ నుంచి బయటపడటం ఎంత కష్టమో తెలుసు, అందుకనే ఉద్యోగం కొనసాగిస్తూనే కేన్సర్ బాధితులకు ఉచితంగా కౌన్సిలింగ్ వంటి ఇతర సామాలు అందిచడం మొదలుపెట్టారామె. ఆ నేపథ్యంలోనే కౌన్సెలింగ్, మెడిటేషన్ సెంటర్నీ ఏర్పాటు చేశారు. అలాగే తన కేన్సర్ చికిత్స అనుభవాలను ‘మోర్ ఒషూకోర్ ఎబోసర్: ఎజోన్ క్యాన్సర్ రోగిర్ ఒబిగోటా’ అనే పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు.
మరోసారి కేన్సర్ తిరగబెట్టడంతో..
2009... అనారోగ్యానికి గురైన భర్తకి సేవలు చేస్తున్నారు మినాతి. విపరీతమైన నడుము నొప్పి. పరీక్ష చేయించుకుంటే మళ్లీ కేన్సర్ తిరగబెట్టిందన్నారు వైద్యులు. ఈసారి పెల్విక్, వెన్నెముక ప్రాంతాల్లో వచ్చింది. అయితే మినాతి అస్సలు భయపడలేదు. కానీ ఆమె భర్త తీవ్ర ఆందోళనకు లోనయ్యి గుండెపోటుతో మరణించారు. వ్యాధి కన్నా విధి పెట్టిన క్షోభకు అల్లాడిపోయారామె. దాంతో మినాతి తీవ్ర అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమయ్యారు.
అప్పుడు తనలాంటి వాళ్ల గురించి ఆలోచించడం ప్రారంబించాక..ఆమెలో తెలియని ఆరాటం, తపన మొదలయ్యాయి. అలాగ మళ్లీ కేన్సర్పై పోరాడేందుకు రెడీ అయ్యారు మినాతి. అయితే ఈసారి కూడా మినాతినే కేన్సర్పై గెలిచారు. ఇక ఈసారి కేన్సర్ జర్నీని కూడా ‘కొలిజా కైతే బిందిలే జి చోరాయే గాన్ గాయే’ అనే పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. అంతేగాదు కేన్సర్ బాధితులకు అండగా ఉండేలా.. డైట్, న్యూట్రిషన్, ప్రాణాయామం, ధైర్యంగా సమస్యతో పోరాడటం... ఇలా ఎన్నో అంశాల్లో అవగాహన కల్పించడం ప్రారంభించారు.
ఆమె సేవలు భారత్కే పరిమితం కాలేదు. శ్రీలంక, అమెరికా, ఆస్ట్రేలియాతో సహా మొత్తం 24 దేశాలకు విస్తరించారు. పైగా ఆమె శరీరాన్ని గుహవాటి మెడికల్ కాలేజ్కి కేన్సర్ పరిశోధనలకు రాసిచ్చారామె. అంతేకాదండోయ్ ఆమె పుస్తకాలు కూడా ఎన్నో భాషల్లోకి తర్జుమా అయ్యి ఎందరో కేన్సర్ భాధితుల్లో అపారమైన ధైర్యాన్ని నింపుతున్నాయి. 79 ఏళ్ల వయసుకి చేరినా.. మినాతి కేన్సర్ సహాయ సేవ కార్యక్రమాలను ఆపలేదు. ఇంకా చేతనైనంతగా ఏదో చేయాలనే ఆమె ఆరాటం ఆకాంక్ష అజరామరం, స్ఫూర్తి కూడా..!
(చదవండి: ఏడేళ్ల వయసుకే.. ఏడు ఖండాలు..! అమెరికన్ బుడ్డోడి ఘనత)


